ప్రపంచ ధనవంతుల్లో ఒకడైన భారతీయ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ.. జియో, రిలయన్స్ రిటైల్ కోసం భారతదేశపు అతిపెద్ద ఐపీఓలను సిద్ధం చేస్తున్నారు. ఈ మెగా ప్లాన్‌లో.. టెలికాం వెంచర్ రిలయన్స్ జియో ప్లాట్‌ఫాం(ఆర్‌జేపీఎల్), అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్‌ఆర్‌వీఎల్) కోసం ప్రత్యేక ప్రారంభ వాటా విక్రయాలు ఉంటాయి.   

దేశీయ పారిశ్రామిక దిగ్గజం, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ సారథ్యం వహిస్తోన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గ్రూప్ కంపెనీల నుంచి త్వరలోనే కొన్ని కీలక ప్రకటనలు వెలువడనున్నాయి. కేంద్ర ప్రభుత్వం జీవిత బీమా సంస్థ నుంచి అతి పెద్ద ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ను ప్రకటించిన ప్రస్తుత పరిస్థితుల్లో- దాన్ని మించి పోయేలా కొత్త ఐపీఓను ముఖేష్ అంబానీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

త్వరలో ఏర్పాటు కానున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా ఈ ప్రకటనలు ఉంటాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. రిలయన్స్ జియో ఐపీఓ (Reliance Jio IPO), రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఐపీఓ (Reliance Retail Ventures IPO)లను ఈ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా ముఖేష్ అంబానీ అధికారికంటా ప్రకటిస్తారని తెలుస్తోంది. కొన్ని వారాల వ్యవధిలో ఈ రెండింటికి సంబంధించిన కంపెనీలను ఐపీఓల ముందుకు తీసుకుని రావడానికి ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు.

రిలయన్స్ జియో.. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఈ రెండు కూడా రిల్‌కు అనుబంధ కంపెనీలుగా కొనసాగుతున్నవే. రిలయన్స్ జియో ఐపీఓను జారీ చేయడం ద్వారా కనీసం 50 వేల కోట్ల రూపాయలను సమీకరించుకోవాలని ముఖేష్ అంబానీ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెబుతున్నారు. రిలయన్స్ రిటైల్ వెంచర్ ఐపీఓ ద్వారా మరో 75 వేల కోట్ల రూపాయలను ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడిగా సేకరించాలని ఆయన ప్రణాళికలను రూపొందించుకున్నారని అంటున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం అంటే అక్టోబర్-నవంబర్-డిసెంబర్‌లో ఈ రెండింటికి సంబంధించిన ఐపీఓలను జారీ చేయొచ్చని అంటున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా దీనిపై ఓ స్పష్టత వస్తుందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లల్లో మాత్రమే కాకుండా.. అంతర్జాతీయంగా కూడా రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ వెంచర్ కంపెనీలను లిస్టింగ్ చేయించాలని అంబానీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రపంచంలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ అమెరికా నాస్‌డాక్‌లో జియో లిస్టింగ్ అయ్యేలా ఆయన చర్యలు తీసుకుంటున్నారని అంటున్నారు. బిగ్గెస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్, టాప్ సెర్చింజిన్ గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా పలు కంపెనీలు జియోలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేశాయి. 33 శాతం మేర వాటాలను కొనుగోలు చేశాయి.