Asianet News TeluguAsianet News Telugu

ఫ్రాన్స్ వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్.. ఇక యూపీఐతోనే లావాదేవీలు, అఫీషియల్‌గా లాంచ్

భారత్‌లో సక్సెస్ అయిన యూపీఐ పేమెంట్స్ విధానం తాజాగా ఫ్రాన్స్‌లోనూ అడుగుపెట్టింది. ఆ దేశ రాజధాని పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ను సందర్శించే పర్యాటకులు ఇప్పుడు భారతదేశ యూనిఫైట్ పేమెంట్ ఇంటర్‌ఫేస్‌ని ఉపయోగించి ఐకానిక్ కట్టడం వద్దకు తమ యాత్రను బుక్ చేసుకోగలుగుతారని నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) తెలిపింది. 

Indian tourists can now buy tickets for Eiffel Tower in Paris via UPI ksp
Author
First Published Feb 2, 2024, 7:44 PM IST

భారత్‌లో సక్సెస్ అయిన యూపీఐ పేమెంట్స్ విధానం తాజాగా ఫ్రాన్స్‌లోనూ అడుగుపెట్టింది. ఆ దేశ రాజధాని పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ను సందర్శించే పర్యాటకులు ఇప్పుడు భారతదేశ యూనిఫైట్ పేమెంట్ ఇంటర్‌ఫేస్‌ని ఉపయోగించి ఐకానిక్ కట్టడం వద్దకు తమ యాత్రను బుక్ చేసుకోగలుగుతారని నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) తెలిపింది. ఎన్‌పీసీఐ తన ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ (ఎన్ఐపీఎల్) ఫ్రెంచ్ ఈ కామర్స్ ఫ్లాట్‌ఫాం లైరాతో జతకట్టింది. 

భారతీయ పర్యాటకులు ఇప్పుడు యూపీఐని ఉపయోగించి ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను కొనుగోలు చేసి ఈఫిల్ టవర్‌ సందర్శనకు టికెట్లు బుక్ చేసుకోవచ్చునని ఎన్‌పీసీఐ తెలిపింది. ఈ లావాదేవీ ప్రక్రియ త్వరగా సులభంగా ఎలాంటి అవాంతరాలు లేకుండా చేసుకోవచ్చునని అధికారిక ప్రకటన తెలిపింది. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఈఫిల్ టవర్‌ను సందర్శించే అంతర్జాతీయ పర్యాటకులలో భారతీయులు రెండవ అతిపెద్ద సమూహంగా వున్నారు. భారతీయ పర్యాటకులు వెబ్‌సైట్‌లో రూపొందించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పేమెంట్స్ చేయవచ్చు. 

ఫ్రాన్స్‌లో యూపీఐ చెల్లింపులను అందించే తొలి మర్చంట్ ఈఫిల్ టవర్ కావడం విశేషం. ఫ్రాన్స్, యూరప్‌లోని పర్యాటకం, రిటైల్ స్థలాల్లో ఇతర వ్యాపారులకు ఈ సేవను త్వరలో విస్తరించనున్నారు. ఎన్ఐపీఎల్ సీఈవో రితేష్ శుక్లా మాట్లాడుతూ.. ఇంటర్ ఆపరబుల్ గ్లోబల్ పేమెంట్ సిస్టమ్‌ను రూపొందించడానికి అంతర్జాతీయ మార్కెట్‌లలో ఎన్‌పీసీఐ చెల్లింపును ఆమోదించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. భాగస్వామ్యాన్ని నెలకొల్పడానికి, వినియోగదారులకు అనుకూలమైన , సురక్షితమైన క్రాస్ బోర్డర్ చెల్లింపులను అందించడానికి ప్రపంచవ్యాప్తంగా వున్న ఆర్ధిక సంస్థలతో చేతులు కలపాలని నిర్ణయించుకున్నామని శుక్లా వెల్లడించారు. 

లైరా ఫ్రాన్స్ కమర్షియల్ డైరెక్టర్ క్రిస్టోఫ్ మారియట్ మాట్లాడుతూ.. 17 ఏళ్లుగా తమ సంస్థ భారత్‌లో వుందన్నారు. ఫ్రెంచ్, యూరోపియన్ టూరిజం ఎకోసిస్టమ్‌లోని వ్యక్తులకు తమ భాగస్వామ్యం పెద్ద పురోగతిని సూచిస్తుందని మారియట్ అభిప్రాయపడ్డారు. 

 

 

ప్రస్తుతం యూపీఐకి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. దాని యూజర్ బేస్ 380 మిలియన్లను మించి వుండగా.. భారత్‌లో స్థిరమైన పేమెంట్స్ మోడ్‌గా మారింది. ఈ ఏడాది జనవరిలో 12.2 బిలియన్లకు పైగా లావాదేవీలను నమోదు చేసిన యూపీఐ ప్రపంచంలోనే అత్యంత సమర్ధవంతమైన తక్షణ చెల్లింపు వ్యవస్థగా దాని స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. తాజాగా ఈఫిల్ టవర్ వద్ద యూపీఐ యాక్సిస్‌ లభించడంతో.. రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా డిజిటల్ లావాదేవీలు మరింత ఊపందుకుంటాయని విశ్లేషకుల అంచనా.  

Follow Us:
Download App:
  • android
  • ios