మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్‌లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. IIPB ఖాతా బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడం, WhatsAppలో కొత్త బ్యాంక్ ఖాతాను తెరవడానికి ఎంపిక వంటి కస్టమర్ సేవలను అందించాలని భావిస్తున్నారు. 2018లో ప్రారంభించిన IPPB అనేది డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ కింద పేమెంట్స్ బ్యాంక్.   

ప్రస్తుతం డిజిటల్ ఎరా నడుస్తోంది. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే అన్ని సేవలూ అందుబాటులో ఉన్నట్టే నగదు బదిలీ, చెల్లింపులు అన్నీ స్మార్ట్‌ఫోన్ల ద్వారానే సాగుతున్నాయి. బ్యాంకింగ్ కార్యకలాపాలు మొదలుకుని షేర్ మార్కెట్స్ లావాదేవీలకు సైతం స్మార్ట్‌ఫోన్లే ఆధారమౌతున్నాయి. దీన్ని మరింత విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

పోస్టాఫీస్ సేవలు కూడా అత్యంత సులువుగా నిర్వహించుకునేలా ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం లీడింగ్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. వాట్సాప్‌-ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌ మధ్య ఈ టైఅప్ కోసం తుది ప్రయత్నాలు మొదలయ్యాయి కూడా. రికరింగ్ డిపాజిట్స్ చెల్లింపులు, సుకన్య సురక్ష యోజన, పోస్టాఫీస్‌ అకౌంట్‌లో నగదు బదిలీ వంటి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా వాట్సాప్ ద్వారానే కొనసాగించేలా ఈ ప్రతిపాదనలను రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. వాట్సాప్ ద్వారానే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో అకౌంట్ కూడా ఓపెన్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది.

ఇప్పటికే ఐపీపీబీలో అకౌంట్ ఉన్న వారు తమ ఖాతాల్లో ఎంత నగదు బ్యాలెన్స్ ఉందనే విషయాన్ని కూడా వాట్సాప్ ద్వారానే చెక్ చేసుకోవచ్చు. ఐపీపీబీ కొత్త అకౌంట్లను దీని ద్వారానే ఓపెన్ చేసుకోవచ్చు. వాట్సాప్ -ఐపీపీబీ మధ్య ఒప్పందం కుదర్చుకోవడానికి తుది ప్రయత్నాలు సాగుతున్నాయని సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఆధార్ టు ఆధార్ ట్రాన్స్‌ఫర్స్, క్యాష్ విత్‌డ్రాయల్స్, డిపాజిట్స్, పాన్/ఆధార్ నంబర్ అప్‌డేట్స్ ఇవన్నీ కూడా వాట్సాప్ ద్వారానే నిర్వహించుకునేలా ఈ ఒప్పందం ఉంటుందని స్పష్టం చేశారు. కొరియర్ ప్యాకేజెస్ బుకింగ్ సౌకర్యాన్ని కూడా వాట్సాప్ ద్వారానే నిర్వహించుకునేలా ఏర్పాట్లు సాగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

రెండు నెలల పాటు పైలెట్ ప్రాజెక్ట్‌గా దీన్ని చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గ్రామీణులు పెద్ద ఎత్తున పోస్టాఫీసుల మీద ఆధారపడి ఉన్నందున వారికి ఈ కార్యకలాపాలన్నింటి మీద అవగాహన కల్పించాల్సి ఉంటుందని, అదో పెద్ద టాస్క్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. 2018లో కేంద్ర ప్రభుత్వం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌ను ప్రారంభించింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 50 మిలియన్ల మంది కస్టమర్లు ఐపీపీబీ సేవలను పొందుతున్నారు. పేటీఎం, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తరువాత మూడో అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థగా రూపుదిద్దుకొంది. బ్యాంకులకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను అందుబాటులోకి తీసుకుని రావడం వల్ల దీనికి ఆదరణ లభిస్తోంది.