ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వ వాటాలను అమ్మేయాలని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, విక్రయం ఎంత అనేది నిర్ణయించబడుతుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (డిఐపిఎఎమ్) కార్యదర్శి తుహిన్ కాంత పాండే తెలిపారు. 

ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం ఇంకో సారి మరో భారీ పెట్టుబడుల ఉపసంహరణకు సిద్ధమైంది. ఇప్పుడు సర్కారీ బ్యాంక్‌ను ప్రైవేటు పరం చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వ వాటాలను అమ్మేయాలని కేంద్రం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల శాఖ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే ఈ మేరకు అధికారికంగా ప్రటించారు. బ్యాంకులోని ప్రభుత్వ వాటాలను అమ్మేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఏమేరకు వాటాలను అమ్మాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. ఐడీబీఐ బ్యాంకులో కేంద్రానికి ప్రస్తుతం 45.48 శాతం వాటా ఉందని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే మొత్తం వాటాను మార్కెట్ ప్రైస్ కు ఒకేసారి అమ్మాలా లేక కొద్దిగా అమ్మాలా అనే దానిపై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోందని వెల్లడించారు. 

అయితే ఐడీబీఐ బ్యాంకులో వాటాల అమ్మకానికి కిందటి సంవత్సరమే కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఐడీబీఐ బ్యాంక్‌ చట్టంలో కావాల్సిన సవరణలను కూడా చేసింది. దీంతో పాటుగా ఎల్‌ఐసీకి 49.24 శాతం వాటాను కూడా అమ్మేయాలని కేంద్ర భావిస్తోంది. త్వరలో ఈప్రక్రియ ప్రారంభం అవుతుందని ప్రకటించింది. ఎల్‌ఐసీ ఐపీవో సజావుగా సాగేందుకు పేటీఎం మనీ అనే సరికొత్త ఫీచర్‌ను కూడా కేంద్రం అమలులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా రూ.5లక్షల వరకు విలువైన షేర్లను యూపీఐ ద్వారా బిడ్డింగ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది. సెక్యూరిటీ ఎక్సేంజ్ బోర్డు జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సౌకర్యం అమలులోకి రాక ముందు ఒక్కో ఇన్వెస్టర్‌ కేవలం రూ.2లక్షల వరకే మాత్రమే యూపీఐ ద్వారా బిడ్డింగ్ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అది రూ.5లక్షలకు పెరిగింది.

భారీ మొత్తం విలువతో రిజిస్టర్ అయిన సంస్థలు.. లిస్టింగ్ అయిన ఐదు సంవత్సరాలలోపు కనీసం 25 శాతం పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌ను కలిగి ఉండాలి. ఇది సెక్యూరిటీ ఎక్సేంజ్ బోర్డు నిబంధన. మార్కెట్ సరళీకరణలో భారంగా ఈ నిబంధనకు కిందటి సంవత్సరం కేంద్ర ఆర్థికశాఖ మినహాయింపు ఇచ్చింది. ఈ వెసులుబాటు కల్పిస్తే ప్రభుత్వరంగం సంస్థలను కొనుగోలు చేసేందుకు ప్రయివేట్ సంస్థలు ఆసక్తి కనబరుస్తాయని కేంద్రం భావిస్తుంది.

ఇక ఎల్‌ఐసీ ఐపీఓకు మార్కెట్‌లో భారీగా డిమాండ్ ఉంది. పలు సంస్థలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈపాటికే 25కుపైగా ఇన్వెస్టర్లు ఎల్‌ఐసీ ఐపీవోకు ఆసక్తి కనబరుస్తున్నారని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. స్వదేశీయ ఇన్వెస్టర్లతో పాటు విదేశాలకు చెందిన పెట్టుబడిదారులు కూడా ఓ ఐపీఓకు ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పింది. ఇలా సేకరించిన నిధులతో సంక్షేమ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కేంద్రం భావిస్తోంది. దేశ ఆర్థిక ప్రగతికి దోహదపడేందుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడం ద్వారా దేశ ఆర్థిక ప్రగతి వేగవంతం చేయవచ్చని కేంద్రం భావిస్తోంది.