సిల్వర్ పైపైకి.. వన్నె తగ్గిన పసిడి
వరుసగా రెండో రోజు కూడా బులియన్ మార్కెట్లో పసిడి ధర తగ్గింది. స్థానికంగానూ బంగారానికి డిమాండ్ లేకపోవడంతో దేశీయంగా ధర పడిపోయింది. మరోవైపు వెండి ధర పైపైకి దూసుకెళ్లింది.
దేశీయ బులియన్ మార్కెట్లో వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావానికి తోడు స్థానికంగా డిమాండ్ లోపించడంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోయాయి. శనివారం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 100 రూపాయలు తగ్గడంతో రూ. 31,350గా నమోదైంది.
మరోవైపు డాలర్కు డిమాండ్ పెరిగింది. ఇటు బంగారం ధరలు తగ్గితే, వెండి ధరలు మాత్రం పైకి ఎగిశాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ రావడంతో వెండి ధరలు పెరిగాయి. శనివారం మార్కెట్లో కేజీ వెండి ధర 275 రూపాయలు పెరిగి రూ. 37,775గా నమోదైంది.
అమెరికా ఉద్యోగ డేటా సానుకూలంగా ఉండటంతో డాలర్కు డిమాండ్ పెరిగింది. దీంతో పసిడిలో పెట్టుబడులు తగ్గాయి. దీనికి తోడు స్థానిక నగల వ్యాపారులు, రిటైలర్ల నుంచి కూడా కొనుగోళ్లు లేకపోవడంతో ధర తగ్గినట్లు బులియన్ వర్గాలు చెప్పాయి.
అంతర్జాతీయంగా పసిడి 0.28శాతం తగ్గి ఔన్సు ధర 1,196.20 డాలర్లు పలికింది. 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 100 రూపాయల చొప్పున తగ్గి, రూ.31,350గా, రూ.31,200గా నమోదైంది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారట్ల బంగారం ధర రూ.31,350కి పడిపోతే, ఆభరణాల ధరలు రూ.31,200 పలికాయి. దీనికితోడు అమెరికాలో ఉద్యోగుల జాబితా మెరుగు పడటంతో డాలర్ బలోపేతమై బంగారం విలువ పడిపోయింది. వారంలో వెండి ధర రూ.275 పెరిగి రూ.37,775లకు చేరింది. వీక్లీ బేస్డ్ డెలివరీ ధర కిలో వెండి రూ.140కు పెరిగి రూ.37,165లకు చేరుకున్నది. వెయ్యి వెండి నాణాల ధర రూ.1000 పెరిగి రూ.72 వేల నుంచి రూ.73 వేలకు చేరుకున్నది.