ఎలాన్ మస్క్ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో సభ్యుడిగా చేరాలని ట్విట్టర్ ఆహ్వానించింది. మస్క్ చేరతారని అంతా భావించారు. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ ట్విస్ట్ ఇచ్చారు. అలాగే మరికొన్ని ఆసక్తికరమైన ట్విట్టర్ పోల్స్ నిర్వహించారు.
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ లో అతిపెద్ద వాటాదారుగా అవతరించిన ఎలాన్ మస్క్ (50) కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్ యాజమాన్య బోర్డులోకి వెళ్లరాదని ఆయన నిర్ణయించుకున్నారని ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ వెల్లడించారు. ట్విట్టర్ లో ప్రస్తుతం ఎలాన్ మస్క్ కు 9.2 శాతం వాటా ఉంది. ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డార్సీ వాటాల కంటే ఇది నాలుగు రెట్లు అధికం.
వాస్తవానికి శనివారం నాడు ట్విట్టర్ బోర్డులోకి ఎలాన్ మస్క్ లాంఛనంగా ప్రవేశిస్తారని ప్రచారం జరిగింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. దీనిపై ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ స్పందిస్తూ, మస్క్ ఎంతో మేలైన నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ట్విట్టర్ తన కార్పొరేట్ లక్ష్యాలపై మరింతగా దృష్టి సారిస్తుందని తెలిపారు. అయితే, ట్విట్టర్ లో ఇతర వాటాదారులు మస్క్ నిర్ణయంపై ఆందోళన చెందుతున్నారని వివరించారు. బోర్డులో ఉన్నప్పటికీ, లేనప్పటికీ తమ వాటాదారుల అభిప్రాయాలకు తాము ఎప్పటికీ విలువ ఇస్తామని, ఇప్పటివరకు ఇచ్చామని కూడా అగర్వాల్ స్పష్టం చేశారు.
ఏప్రిల్ 9వ తేదీనే డైరెక్టర్ బోర్డులో మస్క్ చేరాల్సి ఉంది. అయితే తాను బోర్డ్ డైరెక్టర్గా ఉండనని మస్క్ తనకు తెలియజేసినట్టు అగర్వాల్ వెల్లడించారు. ఈ అంశంపై వివరంగా ట్విట్టర్లో ఓ లేఖను పోస్ట్ చేశారు. బోర్డ్లో ఉన్నా లేకున్నా తమ షేర్హోల్డర్ల విలువైన సూచనలను ఎప్పుడూ తీసుకుంటామని అగర్వాల్ పేర్కొన్నారు. తమ సంస్థకు మస్క్ అతిపెద్ద వాటాదారుడిగా ఉన్నారని వెల్లడించారు.
“బోర్డ్లో చేరాలని మస్క్తో చాలా సంప్రదింపులు జరిపాం. నేను నేరుగా మాట్లాడా. ఆయనతో కలిసి పని చేసేందుకు చాలా ఉత్సాహం కనబరిచాం. ఆయన బోర్డ్ మెంబర్గా ఉండి సంస్థ, మిగిలిన షేర్హోల్డర్ల ప్రయోజనాల కోసం పని చేస్తారని నమ్మాం. బోర్డ్లోకి అహ్వానించాం. ఏప్రిల్ 9వ తేదీన ఎలాన్ మస్క్ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా నియమించాం. అయితే తాను బోర్డ్లో కొనసాగలేనని ఆయన చెప్పారు. అది కూడా మంచికే అని నేను నమ్ముతున్నాం. బోర్డులో ఉన్నా.. లేకున్నా మేం ఎప్పుడు షేర్హోల్డర్ల సలహాలను స్వీకరిస్తాం. ఎలాన్ మస్క్ మా అతిపెద్ద షేర్ హోల్డర్. ఆయన సూచనలు, సలహాలను ఎప్పుడూ తీసుకుంటాం” అని అగర్వాల్ లేఖను విడుదల చేశారు.
