Asianet News TeluguAsianet News Telugu

వొడాఫోన్ విలీన ‘ఐడియా’కు ఓకే.. కానీ కండీషన్స్ అప్లై

రిలయన్స్ జియో స్రుష్టించిన సంచలనంతో వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులార్ సంస్థల విలీనానికి టెలికం మంత్రిత్వ శాఖ సోమవారం ఆమోదం తెలిపింది. కానీ ఈ విలీనం జరిగేందుకు కొన్ని షరతులను కూడా విధించినట్లు తెలుస్తోంది.

DoT clears Idea-Vodafone merger with conditions

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో స్రుష్టించిన సంచలనంతో వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులార్ సంస్థల విలీనానికి టెలికం మంత్రిత్వ శాఖ సోమవారం ఆమోదం తెలిపింది. కానీ ఈ విలీనం జరిగేందుకు కొన్ని షరతులను కూడా విధించినట్లు తెలుస్తోంది. కానీ అధికారికంగా ఆమోదం తెలిపేందుకు సంస్థకు కొన్ని షరతులు విధించినట్లు టెలికం శాఖ వర్గాలు తెలిపాయి. ఈ విలీనం జరగాలంటే వొడాఫోన్‌ స్పెక్ట్రమ్‌ కోసం ఐడియా సెల్యులర్‌ రూ.3,926 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని టెలికం శాఖ షరతు పెట్టినట్లు సమాచారం. ఐడియా, వొడాఫోన్‌లలో ఎవరైనా ఈ మొత్తం చెల్లించవచ్చు.

అంతేకాదు.. రూ.3,342 కోట్ల బ్యాంక్‌ గ్యారెంటీ సమర్పించాలని అడిగిందని తెలుస్తోంది. దేశీయంగా తమ కార్యకలాపాలను విలీనం చేయడం ద్వారా రూ.1.5లక్షల కోట్ల విలువైన అతిపెద్ద టెలికాం సంస్థను ఏర్పాటు చేయాలని ఐడియా, వొడాఫోన్‌ భావించాయి. ఐడియా - వొడాఫోన్ విలీనంతో ఇప్పటివరకు దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థగా రికార్డు కలిగి ఉన్న భారతీ ఎయిర్ టెల్ ఆ రికార్డును కోల్పోనున్నది. 

అంటే ఐడియా సెల్యులార్‌, వొడాఫోన్‌ ఇండియా విలీన సంస్థ విలువ 23 బిలియన్ల డాలర్లు. 43 కోట్ల మంది చందాదార్లతో భారతదేశ మార్కెట్‌లో 35శాతం వాటా ఈ విలీన సంస్థకు ఉండనుంది. అలాగే రుణాలు కూడా ఈ రెండు సంస్థలకు కలిపి రూ.1.5లక్షల కోట్ల మేరకు ఉన్నాయి. రెండు సంస్థల విలీనం తర్వాత టెలికం సంస్థలు రుణ భారం నుంచి తప్పించుకోనున్నాయి. ఈ విలీనం తరవాత సంస్థ పేరును వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌గా మార్చాలని వాటాదార్లు యోచిస్తున్నారు.

విలీన సంస్థలో వొడాఫోన్‌కు 45.1శాతం, ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు 26శాతం, ఐడియా వాటాదార్లకు 28.9శాతం వాటా ఉంటాయి. రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు వాటాలను సమం చేసేందుకు మరో 9.5 శాతం వాటాను వొడాఫోన్‌ నుంచి కొనే హక్కు ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు ఉంటుంది. 

విలీన సంస్థ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా కుమార మంగళం బిర్లా ఉంటారు. బాలేశ్‌ శర్మ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) అవుతారు. ఐడియా చీఫ్ ఫైనాన్సియల్ అధికారి అక్షయ ముంద్రా విలీన సంస్థకు కూడా చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ అవుతారు. ఐడియా సెల్యూలార్ డిప్యూటీ ఎండీ అంబ్రీష్ జైన్ ఇక విలీనం సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా బాధ్యతలు చేపడతారు.

జియో గిగా ఫైబర్‌తో ఎంఎస్ఓ, డీటీహెచ్ ప్లేయర్లపై ప్రతికూల ప్రభావం

రిలయన్స్ జియో త్వరలో ప్రారంభించనున్న ‘జియో గిగా ఫైబర్’ సర్వీసు.. బ్రాడ్ బాండ్ సేవలందిస్తున్న మల్టీపుల్ సిస్టమ్ ఆపరేటర్లు (ఎంఎస్ఓ), డైరెక్ట్ టు హోం (డీటీహెచ్) ప్లేయర్లపై ఖచ్చితంగా ఉంటుంది. ఇండియా రేటింగ్స్ సంస్థ స్పందిస్తూ ‘ఇళ్లు, వ్యాపారాలకు ఫైబర్ ఆధారిత బ్రాడ్ బాండ్ సేవలను జియో గిగా ఫైబర్ అందించనున్నది. దీంతో ఇప్పటివరకు ప్రజలకు సేవలందిస్తున్న రిటైల్ బ్రాడ్‪బాండ్ సేవలకు అంతరాయం కలిగించగల సామర్థ్యం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కే ఉంది.

అయితే ఆయా ప్రాంతాల్లో సబ్ స్క్రైబర్లు, జియో గ్రాఫికల్ వైవిధ్యంపై రిలయన్స్ జియో గిగా ఫైబర్ ప్రభావం ఉంటుంది. ఇందుకు కరంట్ టారిఫ్ రేట్లు, సర్వీస్ ఆఫర్లు దోహదం కానున్నాయి. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న రిలయన్స్ జియో గిగా ఫైబర్ ప్రభావం వచ్చే ఆర్థిక సంవత్సరంలో కనిపిస్తుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. 290 మిలియన్ల ఇళ్లలో ఫిక్స్‌డ్ బ్రాడ్ బాండ్, 180 మిలియన్ల ఇళ్లలో టీవీ సేవలు అందుకుంటున్నారు. ఇందులో జియో 18 శాతం ఇళ్లకు సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.

ప్రస్తుతం బ్రాడ్ బాండ్ టారిఫ్ ఇంటికి రూ.500 - 600గా లెక్కిస్తే 50 మిలియన్ల ఇళ్లలో సేవలందించడంతో మార్కెట్ విలువ రూ.30 వేల నుంచి రూ.36 వేల కోట్లకు చేరుతుందని అంచనా. ఇందులో గణనీయమైన వాటా ‘రిలయన్స్ జియో’ అందుకోనున్నదని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. చివరి వినియోగదారుడి వరకు ఫైబర్ ఆధారిత బ్రాడ్‌బాండ్ ఆఫర్ సేవలందించాలని లక్ష్యంగా రిలయన్స్ జియో గిగా ఫైబర్ ప్రణాళిక రూపొందిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios