యాక్సిస్తో తొలగిన ‘శిఖ’బంధం.. న్యూ ఎండీగా అమితాబ్
ఎట్టకేలకు ప్రైవేట్ బ్యాంక్ ‘యాక్సిస్ బ్యాంక్’మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈఓగా శిఖాశర్మ అనుబంధం ముగిసింది. ఆమె స్థానే కొత్త మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈఓగా అమితాబ్ చౌదరి బాధ్యతలు స్వీకరిస్తారు.
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకు యాక్సిస్ బ్యాంకు సీఎండీగా శిఖా శర్మ వైదొలిగారు. ఆమ స్థానే కొత్త సీఎండీగా అమితాబ్ చౌదరి (54) బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్లో సమాచారాన్ని అందించింది. డిసెంబరు 31నుంచి ప్రస్తుత సీఎండీ శిఖా శర్మ బాధ్యతలనుంచి తప్పుకున్న నేపథ్యంలో బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది.
2021 వరకు సీఎండీగా అమితాబ్ చౌదరి
అమితాబ్ 2019 జనవరి ఒకటో తేదీ నుంచి బ్యాంకు సీఈవో, ఎండీగా అమితాబ్ వ్యవహరిస్తారని యాక్సిస్ బ్యాంకు ప్రకటించింది. 2021, డిసెంబర్ 31వ తేదీ వరకు మూడేళ్లు అమితాబ్ చౌదరి మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. 1987లో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో కెరీర్ ప్రారంభించిన చౌదరి, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్కు సీఎండీగా పనిచేశారు.
నాలుగోసారి శిఖాశర్మ కొనసాగింపునకు ఆర్బీఐ ‘నో’
2018 మే నాటికి మూడవసారి బ్యాంకు సీఎండీగా ఆమె పదవీ కాలం ముగియనుండగా, నాలుగవసారి కూడా ఎండీగా నియమించాలని యాక్సిస్ బ్యాంకు బోర్డు నిర్ణయించింది. భారీ నష్టాలు, నోట్లరద్దు సమయంలో చట్టవిరుద్ధంగా పాతనోట్లను మార్చినట్లు ఆరోపణలు రావడంతో శిఖాశర్మ పునర్నియామకంపై ఆర్బీఐ ప్రశ్నలు లేవనెత్తింది. మరోసారి ఆమె పదవీకాలం పొడిగింపునకు ఆర్బీఐ నిరాకరించింది.
ఇలా శిఖాశర్మ రిటైర్మెంట్ ప్రకటన..
దీంతో 2018 డిసెంబర్ 31వ తేదీనే బాధ్యతలనుంచి తప్పుకోనున్నట్టు గతేడాది ఏప్రిల్లోనే శిఖాశర్మ ప్రకటించారు. దీంతో ఆమె స్థానంలో సీఎండీగా యాక్సిస్ బ్యాంకు అమితాబ్ చౌదరిని గత ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
నష్టాలతో నూతన వసంతానికి మార్కెట్ల స్వాగతం
కొత్త ఏడాది ప్రారంభమైన గంటల్లోనే స్టాక్మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. 90 పాయింట్లకు పైగా ఎగిసి పడిన సెన్సెక్స్ ప్రస్తుతం 80 పాయింట్లు నష్టపోయి 35,984 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 27 పాయింట్లు క్షీణించి 10,836 వద్ద కొనసాగుతున్నది. దీంతో సెన్సెక్స్ 36వేల దిగువకు,నిఫ్టీ 10900 దిగువరకు చేరింది. భారతి ఎయిర్టెల్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంకు, ఎల్ అండ్టీ, ఇండిగో, యూపిఎల్ లాభపడుతున్నాయి. పవర్గ్రిడ్, హిందాల్కో, ఆసియన్ పెయింట్స్, హెచ్సీఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్ నష్టపోతున్న వాటిల్లో ఉన్నాయి. కరెన్సీ మార్కెట్లో రూపాయి పాజిటివ్గా ప్రారంభమైంది. 70మార్క్కు దిగువన డాలర్పై మారకంలో 69.69 వద్ద ట్రేడింగ్ ఆరంభించింది.