Asianet News TeluguAsianet News Telugu

విలీనాలకు వేళాయెనా?

దేశీయ విమానయాన రంగంలో కొనుగోళ్లు, విలీన ఒప్పందాలకు సమయం అసన్నమైనట్లు కన్పిస్తున్నది. ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు అదే సంకేతాలిస్తున్నాయి.

airlines ready for merging
Author
Mumbai, First Published Oct 29, 2018, 10:26 AM IST

దేశీయ విమానయాన రంగంలో కొనుగోళ్లు, విలీన ఒప్పందాలకు సమయం అసన్నమైనట్లు కన్పిస్తున్నది. ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు అదే సంకేతాలిస్తున్నాయి.

గత కొన్నాళ్లపాటు లాభాల్లో దూసుకెళ్లిన విమాన సంస్థలు.. మళ్లీ ఈ ఆర్థిక సంవత్సరంలో నష్టాల రన్‌వేపై ల్యాండ్‌ కావడంతోపాటు నిర్వహణపరమైన ఒత్తిళ్లు పెరుగుతుండటం విలీన అవకాశాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. 

భారత విమాన సేవల రంగంలో త్వరలోనే ఒకట్రెండు విలీన, కొనుగోలు (ఎం అండ్‌ ఏ) ఒప్పందాలు చోటు చేసుకునే అవకాశాలులేకపోలేవని విశ్లేషకులంటున్నారు. ఇందుకు బలాన్ని చేకూరుస్తూ.. జెట్‌ ఎయిర్‌వే్‌సపై టాటా గ్రూపు కన్నేసినట్లు ఈ మధ్య వార్తలొచ్చాయి.

విస్తారా, ఎయిర్‌ ఏషియా ఇండియాలో ప్రధాన వాటా కలిగిన టాటా సన్స్‌.. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్‌ ఎయిర్‌వే్‌సలో మెజారిటీ వాటా కొనుగోలుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇరు వర్గాల మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రాలేదని సమాచారం.

ఇదిలా ఉంటే, ఇండిగో కూడా ఇతర విమాన సంస్థల కొనుగోలుకు ఆసక్తిగా ఉంది. ఆకర్షణీయమైన ఆఫర్‌ అయితే గనుక ఇతర ఎయిర్‌లైన్‌ను కొనుగోలుకు సిద్ధమేనని బుధవారం రెండో త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా ఇన్వెస్టర్లతో కాల్‌ కాన్ఫరెన్స్‌లో ఇండిగో ప్రమోటర్‌ రాహుల్‌ భాటియా సంకేతాలిచ్చారు.

దేశంలో అత్యధిక నగదు నిల్వలు కలిగిన విమాన కంపెనీ ఇండిగో. ఈ సంస్థ వద్ద రూ.13,000 కోట్ల మేర నగదు నిల్వలున్నాయి. 40 శాతం మార్కెట్‌ వాటాతో అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌ కంపెనీగా కొనసాగుతున్న ఇండిగో.. అంతర్జాతీయ మార్గాల్లో సేవలను విస్తరించాలనుకుంటోంది. ఇందుకోసం ఎయిర్‌ ఇండియా అంతర్జాతీయ కార్యకలాపాల విభాగాన్ని కొనుగోలు చేసేందుకు గతంలో సంస్థ ఆసక్తి ప్రదర్శించింది.
 
విదేశీ సంస్థల్లోనూ ఆసక్తి
దేశీయ విమాన రంగంలో వ్యాపార అవకాశాలపై విదేశీ ఎయిర్‌లైన్స్‌ కూడా ఆసక్తిగా ఉన్నాయి. జెట్‌లో వాటా కొనుగోలు ద్వారా ఎతిహాద్‌, టాటా గ్రూపుతో సంయుక్త భాగస్వామ్యం ద్వారా ఎయిర్‌ ఏషియా, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌లు ఇప్పటికే భారత మార్కెట్లోకి ప్రవేశించాయి.

ఖతార్‌ ఎయిర్‌వేస్‌, లుఫ్తాన్సాతోపాటు పలు ఇంటర్నేషనల్‌ ఆపరేటర్లు మన మార్కెట్లోకి ప్రవేశించాలనుకుంటున్నాయి. ఈ ప్రయత్నాల్లో భాగంగా అవి దేశీయ విమాన సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నాయి.
 
ఆపరేటర్లు ఎక్కువైపోయారా?
ప్రస్తుతం భారత్‌లో 26 విమాన కంపెనీలు సేవలందిస్తున్నాయి. అందులో 8 కంపెనీలే 98 శాతంపైగా మార్కెట్‌ వాటా కలిగి ఉన్నాయి. ప్రపంచంలో ఏడో అతిపెద్ద విమాన మార్కెట్‌ అయినప్పటికీ భారత్‌లో విమాన సేవలకు ఇప్పుడిప్పుడే డిమాండ్‌ పెరుగుతోంది.

ప్రధాన కంపెనీల సేవల సామర్థ్యం మార్కెట్‌ డిమాండ్‌ కంటే అధిక స్థాయిలో ఉండటంతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు టిక్కెట్లపై భారీ రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పిస్తున్నాయి. దీంతో వాటి మధ్య పోటీ తీవ్రతరమైంది.

పైగా, పెరిగిన ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చుల భారాన్ని వినియోగదారులపై మోపే సాహసం చేయలేకపోతున్నాయి. ఫలితంగా కంపెనీలపై ఆర్థికంగా ఒత్తిడి పెరిగింది. ఈ పరిణామం విమాన రంగంలో విలీనాలకు, వాటా విక్రయ ఒప్పందాలకు బాటలు వేయవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.
 
దేశీయ విమాన రంగంలోని ప్రధాన సంస్థలు:
1. ఎయిర్‌ ఇండియా
2. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌
3. జెట్‌ ఎయిర్‌వేస్‌
4. ఇండిగో
5. గో ఎయిర్‌
6. స్పైస్‌జెట్‌
7. ఎయిర్‌ ఏషియా ఇండియా
8. విస్తారా
 
నష్టాల బాటలో సంస్థలు
మార్కెట్‌ వాటా పరంగా అతిపెద్ద విమాన సంస్థ అయిన ఇండిగో.. సెప్టెంబరు త్రైమాసికానికి రూ.652 కోట్ల నష్టం ప్రకటించింది. 2015 నవంబరులో స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అయ్యాక సంస్థ నష్టాలు ప్రకటించడం ఇదే తొలిసారి.

భారీగా పెరిగిన నిర్వహణ ఖర్చులు, ఇండస్ట్రీలో తీవ్రతరమైన పోటీ సంస్థను నష్టాల్లోకి నెట్టాయి. గత మూడు నెలల్లో ఇండిగో రాబడి 18 శాతం పెరిగి రూ.6,514 కోట్లుగా నమోదైంది. కానీ, అదే కాలానికి ఖర్చులు రూ.7,502.3 కోట్లకు పెరగడం నష్టాలకు కారణమైంది.

పెరిగిన ఇంధన ధరల దెబ్బకు జెట్‌ ఎయిర్‌వేస్‌, స్పైస్‌జెట్‌లు జూన్‌ త్రైమాసికంలోనే నష్టాల్లోకి మళ్లాయి. జూలై-సెప్టెంబరు మధ్యకాలానికి ఈ రెండు సంస్థల నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios