రూ.500 కోట్లే లక్ష్యం: ‘బంగారు బాతు’ల సేల్స్ ‘మహరాజా’ రెడీ
కేంద్ర ప్రభుత్వ విధానాలు, అధికారుల సాచివేత ధోరణులు, అనాలోచిత వైఖరి పుణ్యమా? అని అప్పుల ఊబిలో చిక్కుకున్న ఎయిర్ ఇండియాపై ‘ప్రైవేటీకరణ’ వేటు వేలాడుతోంది. కానీ ఈలోగా సంస్థ కార్యకలాపాల నిర్వహణకు రుణ బకాయిల చెల్లింపునకు అవసరమైన రూ.500 కోట్ల కోసం ఎయిరిండియా తన ఆస్తులను అమ్ముతోంది.
ముంబై: అప్పుల ఊబిలో చిక్కుకున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తనకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో వున్న దాదాపు 50కి పైగా ఆస్తులను అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఆస్తుల విక్రయాల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రు.500 కోట్లకు పైగా నిధులను సమకూర్చుకోవాలని ఎయిరిండియా యాజమాన్యం భావిస్తోంది. గత ఫిబ్రవరిలో అత్యధిక రిజర్వ్ ధరలకు అమ్మకానికి పెట్టిన ఆస్తులు అమ్ముడు పోకపోవటంతో ప్రస్తుతం ధరలను తగ్గించి మరోసారి అమ్మకానికి పెట్టినట్లు సమాచారం.
భూములు, ఫ్లాట్ల వేలానికి ఎయిరిండియా వేలం
ఎయిరిండియా అమ్మకానికి పెట్టిన ఆస్తుల్లో ముంబైలోని బాంద్రా, ఖార్, కొలాబా, కుఫే పరేడ్, మలాడ్ ప్రాంతాలు, బెంగళూరులోని ఇందిరానగర్, నవరంగ్పురా, అహ్మదాబాద్లోని మేంనగర్, కోల్కతా, పుణే, భుజ్, గోవా, గ్వాలియర్, తిరువనంతపురం తదితర నగరాలలో వున్న అపార్ట్మెంట్లు, భూములు వేలానికి పెట్టినట్లు ఎయిరిండియా సంస్థ గురువారం ఒక దినపత్రికలో ప్రకటించిన వాణిజ్య ప్రకటనలో తెలిపింది. తన ఆస్తులను డిజిన్వెస్ట్ చేసేందుకు ఎయిరిండియా సంస్థ ప్రభుత్వ రంగంలోని ఎంఎస్టిసిని రంగంలోకి దించింది. ఇందుకు సంబందించిన ఈ-బిడ్లను అక్టోబర్ 12లోగా ఆన్లైన్లో సమర్పించాల్సి వుంటుంది.
ఫిబ్రవరిలో వేలం ప్రక్రియతో రూ.35 కోట్లు నష్టం
ఈ ఆస్తుల విక్రయాల ద్వారా దాదాపు రు.500 కోట్ల నిధులను సమకూర్చుకోవాలని భావిస్తున్నట్లు ఎయిరిండియాకు చెందిన ఒక సీనియర్ అధికారి వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వేలం ప్రక్రియలో సంస్థకు రు.30 నుండి 35 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. ప్రస్తుతం రు.55 వేల కోట్లకు పైగా రుణభారంలో కూరుకుపోయిన ఈ సంస్థ తాజా విక్రయాల ద్వారా లభించే సొమ్మును బకాయిలు తీర్చటానికి వినియోగించనున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్ చమురు దిగుమతులపై కోత
ఇరాన్ నుండి ముడి చమురు ఉత్పత్తుల దిగుమతిపై భారత్ కంపెనీలు భారీగా కోత విధించాయి. ఈ సంవత్సరారంభంలో దిగుమతి చేసుకున్న చమురులో దాదాపు సగభాగాన్ని సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నిలిపి వేయనున్నాయి. అమెరికా నవంబర్లో ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలు విధించనున్న క్రమంలో, వాటి ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో ముడి చమురు దిగుమతులపై చమురు కంపెనీలు కోత విధించాయి. ఇరాన్ నుండి భారత్కు దిగమతయ్యే ముడి చమురులో నెలకు 12 మిలియన్ బారెల్స్ చొప్పున ఈ నెల, అక్టోబరు నెలలో కోత విధించనున్నది.
ముందే పెట్రోల్ దిగుమతి చేసుకున్న ఇండియన్ కంపెనీలు
సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో కొనుగోళ్ళపై కోతను ముందుగానే ఊహించి ఏప్రిల్-ఆగస్టు మాసాలలోనే వివిద దేశాలు గానీ, భారత పెట్రోలింయం సంస్థలు గాని అత్యధికంగా దిగుమతులు చేసుకున్నాయి. అయితే ఆగస్టు 6 నుండి కొన్ని ఆర్థిక ఆంక్షలను విధించిన అమెరికా అందులో భాగంగా పెట్రోల్ రంగంపై విధించిన ఆంక్షలు నవంబర్ 4 నుండి అమలులోకి రానున్నాయి. ఇరాన్కు భారత్ అతిపెద్ద రెండో చమురు వినియోగదారు. ఇరాన్ నుండి చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా తొలి స్థానంలో ఉంది.