నూతన సంవత్సరంలో పేటీఎంకు నయా జోష్...
ఆరు నెలల తర్వాత డిజిటల్ పేమెంట్ బ్యాంక్ ‘పేటీఎం’కు ఊరట లభించింది. ఖాతాలను పున: ప్రారంభించేందుకు పేటీఎంకు అనుమతినిస్తూ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.
న్యూడిల్లీ: నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న పేటీఎం సంస్థకు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఊరట నిచ్చింది. ఈ - వాలెట్లను తెరువడంతోపాటు కొత్త వినియోగదారులను చేర్చుకునేందుకు అనుమతినిచ్చింది. గతేడాది నిలిచిపోయిన బిజినెస్ను పునఃప్రారంభించడానికి ఆర్బీఐ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
దీంతో తన బ్యాంకింగ్ సేవలను మరింత మెరుగుపరచడానికి సంబంధిత వినియోగదారుల నో యువర్ కస్టమర్ (కేవైసీ) ప్రక్రియను ప్రారంభించాలని యోచిస్తోంది. విజయ్శేఖర్ శర్మతోపాటు వన్9 కమ్యూనికేషన్స్ యాజమాన్యంలోని పేటీఎం బ్యాంకు కెవైసీ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిందన్న ఆరోపణలతో గత ఏడాది జూన్ 20వ తేదీన కొత్త కస్టమర్లను నమోదును ఆర్బీఐ నిలిపివేసింది.
అలాగే బ్యాంక్ సీఈవో రేణు సత్తిని తొలగించి, కొత్త సీఈవో, ఎండీగా సతీష్ గుప్తాను నియమించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాదాపు 32 ఏళ్ల అనుభవం కల సతీష్ గుప్తా ఒక అనుభవజ్ఞుడైన బ్యాంకర్. నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తో చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కాగా పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో సుమారు 42 మిలియన్ల ఖాతాలు ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి 100 మిలియన్ల వినియోగదారులను చేరుకోవాలని పేటీఎం లక్ష్యంగా పెట్టుకుంది.
కొత్త నిబంధనల ప్రకారం పేటీఎం పేమెంట్ బ్యాంకు సమీప కేవైసీ పాయింట్ వద్దకు వెళ్లి ఓటర్ ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, నరేగా కార్డు చూపి కొత్త పేటీఎం ఖాతా తెరవొచ్చు. జీరో నుంచి రూ. లక్ష వరకు పేమెంట్ బ్యాంకులో ఖాతాలు నిర్వహించొచ్చు. ఫ్రీ డిజిటల్ లావాదేవీల కోసం ఖాతాదారులు డిజిటల్ రూపే డెబిట్ కార్డు అందుకోవచ్చు.