Asianet News TeluguAsianet News Telugu

కేంద్రం చర్యలు భేఖాతరు: రూ.32 వేల కోట్ల మేరకు బ్యాంకులకు శఠగోపం

బ్యాంకుల్లో మోసాలను అరికట్టేందుకు తీసుకొంటున్న చర్యలు సత్పలితాలను ఇవ్వడం లేదు. పలు బ్యాంకుల్లో మోసాలు జరిగినట్టుగా  ఆర్టీఐ చట్టం ద్వారా బయటపడింది.

18 PSBs hit by 2,480 cases of fraud of Rs 32,000 cr in Q1: RTI
Author
New Delhi, First Published Sep 9, 2019, 11:17 AM IST

న్యూఢిల్లీ: బ్యాంకింగ్ మోసాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వ చర్యలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వడం లేదని మరోసారి రుజువైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 18 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 2,480 మోసాలు జరిగినట్లు ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్న ద్వారా వెల్లడైంది. వీటి విలువ నికరంగా రూ. 31,898.63 కోట్లు అని తేలింది.

అత్యధికంగా మోసాలకు గురైంది ఎస్బీఐనే
అత్యధికంగా దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో 38 శాతం మోసాలు జరిగినట్లు నీముచ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ పీటీఐకి వెల్లడించారు. ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు ఈ సమాచారం లభించినట్లు ఆయన చెప్పారు. ఏప్రిల్ నుంచి జూన్ మధ్యకాలంలో ఎస్బీఐలో 1,197 మోసాలు జరిగాయి. 
వీటి విలువ రూ.12 వేల కోట్లకు పైమాటే. 

మోసాల జాబితాలో అలహాబాద్ బ్యాంకుకు రెండో స్థానం
ఎస్బీఐ తర్వాత అత్యధికంగా అలహాబాద్ బ్యాంక్‌లో మోసాలు జరిగినట్లు ఈ సమాచారం మేరకు వెల్లడైంది. ఈ బ్యాంక్‌లో రూ.2,855.46 కోట్ల విలువైన 381 మోసాలు జరిగాయి. బ్యాంకింగ్ మోసాల జాబితాలో 99 కేసులతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మూడోస్థానంలో నిలిచింది. వీటి విలువ రూ.2,526.55 కోట్లని పేర్కొంది. 

మోసాలపై సమాచారం ఇవ్వని ఆర్బీఐ
ఈ బ్యాంకింగ్ మోసాలపై రిజర్వు బ్యాంక్ ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. గత త్రైమాసికంలో మోసాల ద్వారా బ్యాంకులు ఎంతమేర నష్టపోయాయో, ఎన్ని మోసాలు జరిగాయన్న విషయంపై మా వద్ద ఎలాంటి సమాచారం లేదని ఆర్బీఐ స్పష్టంచేసింది. వీటితోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ)లో 75 కేసులు నమోదవగా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ)లో 45, కెనరా బ్యాంక్ లో 69 కేసులు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 194 కేసులు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 31 కేసులు నమోదైనట్లు తెలిసింది. 

ఇలా బ్యాంకుల్లో మోసాల జాబితా
కార్పొరేషన్ బ్యాంక్‌లో 16 కేసులు నమోదవగా, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌లో 46 కేసులు, సిండికేట్ బ్యాంక్‌లో 54, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 51, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 42, యూకో బ్యాంక్‌లో 34 కేసులు దాఖలయ్యాయి. వీటితోపాటు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఆంధ్రాబ్యాంక్, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌లో కూడా మోసాలు జరిగినట్లు ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు సమాచారం వెల్లడైంది. 2018-19లో బ్యాంకింగ్ రంగంలో 71వేల కోట్ల మోసాలు జరిగాయి.

మొండి బాకీ ఆస్తుల విక్రయానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ చర్యలు
ఇదిలా ఉండగా, మొండి బకాయిలతో సతమతమవుతున్న ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) వీటిని వదిలించుకోవడానికి ప్రయత్నాలను వేగితరం చేసింది. బ్యాంక్‌కు చెందిన 11 నిరర్థక ఆస్తులను విక్రయించడం ద్వారా రూ.1,234 కోట్ల రుణాలను రికవరీ చేయాలనుకుంటున్నది. ఈ ఆస్తుల కొనుగోలు కోసం  ఆర్‌సీఎస్/ఎన్‌బీఎఫ్‌సీఎస్/బ్యాంకులు/ఆర్థిక ఇనిస్టిట్యూట్‌ల నుంచి బిడ్డింగ్‌లను ఆహ్వానించింది. 

ఈ నెల 12-20 మధ్య బిడ్లను ఆహ్వానించిన పీఎన్బీ
బ్యాంక్‌కు విసా స్టీల్ బకాయిపడిన రూ.441.83 కోట్ల ఖాతాతోపాటు ఇండ్‌భారత్ ఎనర్జీ(ఉత్కల్) రూ.414.23 కోట్లు, అస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.113.57 కోట్లు, ఓమ్ శివ్ ఏస్టేట్స్‌కు సంబంధించిన రూ.100.16 కోట్లు ఉన్నాయి. విక్రయించేవాటిలో వంద శాతం నగదు రూపంలోనే ఉన్నాయని బ్యాంక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఆస్తులు కొనుగోలు చేయాలనుకునేవారు ఈ నెల 12 నుంచి 20 లోగా తమ బిడ్డింగ్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. 21న బిడ్డింగ్‌లను బ్యాంక్ బహిర్గతం చేయనున్నది.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios