Asianet News TeluguAsianet News Telugu

కాలగర్భంలోకి టాటా ‘‘నానో’’...ఏడాది ముందుగానే..?

సేవా ద్రుక్పథం.. సామాన్యుడి అవసరాలు కలగలిపి పారిశ్రామిక ఉత్పత్తులు సాగిస్తున్న సంస్థ టాటా సన్స్. దాని అనుబంధ టాటా మోటార్స్ నుంచి మధ్య తరగతి ప్రజల కలల కారుగా పేరొందిన ‘నానో’ కారు ఇక చరిత్రగానే మిగలనున్నది. 

Zero production, sale of Tata Nano in January
Author
New Delhi, First Published Feb 6, 2019, 11:01 AM IST

రతన్‌ టాటా కలల కారు పీపుల్స్ కారు‘నానో’చరిత్రలో ఒక విఫల గాధగా మిగలనున్నది. గత నెలలో గుజరాత్‌లోని సనంద్‌ వద్ద టాటా మోటార్స్‌ ప్లాంట్‌లో ఒక్క ‘నానో’ కారు కూడా ఉత్పత్తి చేయలేదు. అలాగే దేశంలో ఎక్కడా ఒక్క ‘నానో’కారూ అమ్ముడుపోలేదు. ఎగుమతులదీ ఇదే పరిస్థితి. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ 83 నానో కార్లు ఉత్పత్తి చేసి, 62 కార్లను విక్రయించింది. 

‘నానో’ కార్ల ఉత్పత్తి నిలిచిపోయిందని, సేల్స్ కూడా జరుగలేదని టాటా మోటార్స్‌ సంస్థ మంగళవారం రెగ్యులేటరీ సంస్థలకు సమర్పించిన ఫైలింగ్‌లో ఈ విషయం తెలిపింది. నిజానికి వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ కార్ల ఉత్పత్తి నిలిపి వేయాలని, టాటా మోటార్స్‌ నిర్ణయించింది. 

ప్రస్తుత నానో కారు, కొత్తగా అమలులోకి వస్తున్న బీఎస్‌-6 ప్రామాణిక కాలుష్య నిబంధనలు, భద్రతా నిబంధనలకు అనుగుణంగా లేదు. అందుకు అనుగుణంగా తీర్చిదిద్దాలంటే మరింత ఖర్చు చేయాలి. చేసినా, కొనుగోలుదారుల ఆదరణను చూరగొంటుందన్న నమ్మకం లేదు. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి ‘నానో’ కార్ల ఉత్పత్తి నిలిపి వేయాలని నిర్ణయించింది. 

ఈ లోపే మార్కెట్లో అమ్మకాలు జీరో స్థాయికి పడిపోవడంతో వచ్చే ఏడాది మార్చి కంటే ముందే, ‘నానో’ కారు చరిత్ర చరిత్రగా మిగిలి పోతుందని భావిస్తున్నారు. టాటా మోటార్స్ వర్గాలు మాత్రం దీనిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదంటున్నాయి. డిమాండ్‌ను బట్టి నానో కార్ల ఉత్పత్తి ఉంటుందని కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.గతేడాది జూన్ నెలలో ఒకే ఒక్క కారు ఉత్పత్తి చేస్తే, మూడు కార్లు విక్రయించింది టాటా మోటార్స్. 
 
సామాన్య మధ్య తరగతి ప్రజలకు కూడా రూ.లక్షకే కారు అందించాలనే రతన్‌ టాటా సంకల్పంతో, టాటా మోటార్స్‌ కంపెనీ ‘నానో’ కారును అభివృద్ధి చేసింది. జనవరి, 2008లో ఢిల్లీలో జరిగిన ఆటో షోలో ఈ కారును తొలిసారి ప్రదర్శించారు. ఆ మరుసటి ఏడాది మార్చి నుంచి ‘నానో’ కార్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. 

2008 మార్చిలో నానో కార్ల అమ్మకాలు మొదలయ్యేసరికే ఉత్పత్తి ఖర్చులు పెరిగి పోయాయి. అయినా ‘నా వాగ్దానం వాగ్ధానమే’ అని రతన్‌ టాటా స్పష్టంగా పేర్కొనడంతో టాటా మోటార్స్‌ ‘నానో’ బేసిక్‌ మోడల్‌ను రూ.లక్షకే అందించింది.
 
నానో కారు ప్రాజెక్టు ప్రారంభం నుంచే పలు సమస్యలను ఎదుర్కొన్నది. నిజనానికి టాటా మోటార్స్‌ ఈ కారును పశ్చిమ బెంగాల్‌లోని నందిగామ్‌ దగ్గర ఉత్పత్తి చేయాలనుకున్నది. అందుకు అవసరమైన భూమిని నాటి వామపక్ష ప్రభుత్వం కంపెనీకి కేటాయించింది. రైతుల నుంచి బలవంతంగా ఈ భూములు సేకరించారని పేర్కొంటూ త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు చెలరేగాయి.

దాంతో టాటా మోటార్స్ ఈ ప్లాంట్‌న గుజరాత్‌లోని సనంద్‌కు తరలించింది. మార్కెట్లోకి వచ్చాక కూడా ఈ కారు ఇంజిన్‌లో మంటలు వస్తున్నాయని పలు ఫిర్యాదులు వచ్చాయి. దాంతో సామాన్య మధ్య తరగతి ప్రజలు కూడా ఈ కారుపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ‘అత్యంత చౌకైన కారు’ అని ప్రచారం చేయడం కూడా నానో కారు అమ్మకాలను దెబ్బతీసిందని రతన్‌ టాటా పేర్కొన్నారు.

టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ గా 2017లో ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ సైతం ‘నానో’ కారు టాటా మోటర్స్ సంస్థకు నష్టాలు తెచ్చిపెట్టే యూనిట్ అని పేర్కొన్నారు. నిత్యం విలువ పడిపోవడంతోపాటు రూ.1000 కోట్ల నష్టం వాటిల్లుతోందని కూడా తెలిపారు.

నానో కారును లాభాల బాట పట్టించేందుకు టాటా మోటార్స్ వద్ద వ్యూహాలు లేవని టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ న్నారు. అంతేకాదు భావోద్వేగ పూరిత అంశాలతోనే టాటా మోటార్స్ తన ‘నానో’ కార్ల ఉత్పత్తిని కొనసాగిస్తోందని అప్పట్లో మిస్త్రీ వ్యాఖ్యానించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios