3.5 సెకన్లలో 100 కి.మీ స్పీడ్: హార్లీ డేవిడ్సన్ ‘విద్యుత్’ బైక్ ‘లైవ్ వైర్’
భారత విపణిలోకి అమెరికా హార్లీ డేవిడ్సన్ విద్యుత్ ‘బైక్’ లైవ్ వైర్ ఆవిష్కరించే టైం వచ్చేసింది. ఈ నెల 27వ తేదీన ఆవిష్కరించనున్నట్లు ఆ సంస్థ వర్గాలు తెలిపాయి.
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన లగ్జరీ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ హార్లీ డేవిడ్సన్.. తమ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ ‘లైవ్ వైర్’ను ఈ నెలాఖరులో భారత మార్కెట్లో ఆవిష్కరించనున్నది. సంస్థ నుంచి రానున్న మరికొన్ని కొత్త మోడళ్లను సైతం భారత వినియోగదారులకు పరిచయం చేయనున్నది. గత జనవరిలో బైక్ ‘లైవ్ వైర్’ ధర, ఫీచర్లు ఇతర వివరాలను అమెరికా మార్కెట్కు పరిచయం చేసింది.
తాజాగా భారత విపణికి ఆ వివరాలు రాబోతున్నాయి. ఈ నెల 27వ తేదీన భారత మార్కెట్లో హార్లీ డేవిడ్సన్ ‘లైవ్ వైర్’ బైక్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లోగానీ, వచ్చే ఏడాది ప్రారంభంలోగానీ దీనిని భారత్లో విక్రయించవచ్చు.
15.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో రానున్న ఈ బైక్ 78కిలో వాట్/104.6 బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తుంది. అలాగే 116ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. విద్యుత్ వాహనం కావడంతో బైక్ స్టార్ట్ చేసిన కేవలం 3.5 సెకన్లలోనే 0-100 కేఎమ్పీహెచ్ వేగాన్ని అందుకుంటుంది.
ఒకసారి ఛార్జ్ చేసే ఇది సుమారు 235 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. పానాసోనిక్ సహకారంతో కంపెనీ ఈ బైక్లో టెలీమాటిక్స్ కంట్రోల్ యూనిట్ (టీసీయూ) అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీంతో దీన్ని యాప్కి అనుసంధానం చేయవచ్చు. దీని ద్వారా బైక్ బ్యాటరీ స్టేటస్, వెహికల్ ట్రాకింగ్ వంటి పలు అంశాలు తెలుసుకోవచ్చు.
బ్యాటరీ స్టేటస్, సర్వీస్ గడువు, దగ్గర్లోని ఛార్జింగ్ స్టేషన్ల వివరాలు వంటి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అలాగే దీనిలో ఉండే టచ్స్క్రీన్తో ఫోన్కాల్స్ని స్వీకరించొచ్చు. మ్యూజిక్ని ఎంజాయ్ చేయవచ్చు. బ్లూటూత్ సౌకర్యం కూడా ఉంది.