త్వరలో ఆటోమోబైల్ హబ్గా ‘గుజరాత్’ ఆవిర్భావం
అన్ని సకాలంలో జరిగితే త్వరలో గుజరాత్ రాష్ట్రంలోని మండల్ బెచరాజీ ప్రత్యేక పెట్టుబడుల రీజియన్ దేశీయ ఆటోమొబైల్ హబ్గా అవతరించనున్నది.
ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోని మండల్ బెచరాజీ ప్రత్యేక పెట్టుబడుల రీజియన్ దేశంలోనే అతిపెద్ద ‘ఆటోమొబైల్ హబ్’గా రూపాంతరం చెందనున్నది. ప్రస్తుతం ప్రతియేటా ఈ ప్రాంతం నుంచి పది లక్షలకు పైగా కార్లను తయారవుతున్నాయి.
ఆయా కార్ల తయారీ సంస్థలు తమ సంస్థల విస్తరణ ప్రణాళికల అమలును పూర్తి చేస్తే తప్పనిసరిగా ‘ఆటోమొబైల్ హబ్’గా అవతరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. అహ్మదాబాద్ నగరానికి, గుజరాత్ రాష్ట్రంలోని ముంద్రా, కండ్లాలకు మధ్య మండల్ బెచరాజీ ప్రత్యేక పెట్టుబడుల ప్రాంతం (ఎంబీఎస్ఐఆర్) ఏర్పాటై ఉంది.
ఇండస్ట్రీయల్ ఎక్స్ టెన్షన్ బ్యూరో మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ కుమార్ బెనీవాల్ మాట్లాడుతూ గత రెండేళ్లుగా హొండా, ఫోర్డ్, చైనీస్ సయిక్, టాటా మోటార్స్, సుజుకి మోటార్స్ ఆధ్వర్యంలో రెండేళ్లలో ఏడాదికి పది లక్షల కార్లు తయారు చేస్తున్నాయని చెప్పారు. మొదటి దశలో ఒక్కో కార్ల తయారీ సంస్థకు వెయ్యికి పైగా అనుబంధ, విడి భాగాల వెండార్ల నుంచి మద్దతు లభిస్తోంది.
సుజుకి మోటార్స్ ఇప్పటికే రెండో దశ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి మూడోదశ ప్లాంట్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందిస్తోందని రాజ్ కుమార్ బెనీవాల్ చెప్పారు. రెండో దశ, మూడో దశ ప్లాంట్ల నిర్మాణం వచ్చే ఐదేళ్లలో పూర్తవుతుందని రాజ్ కుమార్ బెనీవాల్ అంచనా వేశారు.
ఈ మూడు దశల్లో ప్లాంట్ నిర్మాణం పూర్తయితే ఏటా 25 లక్షల కార్లు తయారవుతాయని.. ఇదే ఈ ప్రాంతాన్ని భారతదేశ ఆటోమొబైల్ హబ్ గా తీర్చిదిద్దుతుందని ఆయన తెలిపారు. ఇక ధొలెరా ప్రత్యేక పెట్టుబడుల ప్రాంతం ఏర్పాటు కోసం అవసరమైన భూ సేకరణ కార్యక్రమం చేపట్టామని రాజ్ కుమార్ బెనీవాల్ తెలిపారు.
ఈ ప్రాంతంలో పరిశ్రమల నిర్మాణానికి 900 చదరపు కిలోమీటర్ల భూమి అవసరం. దొలెరా ఎస్ఐఆర్లో డిఫెన్స్, ఆటోమొబైల్, ఇంజినీరింగ్, టెక్స్ టైల్ ఇండస్ట్రీలు కొలువు దీరనున్నాయి. ఈ ప్రాంతంలో రోడ్లు, గ్యాస్ కనెక్టివిటీ, తాగునీరు, ఇంటర్నెట్, ఆప్టికల్ ఫైబర్ లైన్లు తదితర మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తోంది. వీటితోపాటు అదనంగా విద్యుత్ వసతులు కల్పిస్తోంది.
అత్యంత వేగవంతమైన వస్తువుల రవాణా కారిడార్ ‘ఢిల్లీ- ముంబై కారిడార్’లో 36 శాతం గుజరాత్ రాష్ట్రం మీదుగా సాగుతుంది. ఈ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా 100 కిలోమీటర్ల విస్తీర్ణంలో పలు రకాల ఇండస్ట్రీయల్ హబ్ లను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించామని రాజ్ కుమార్ బెనీవాల్ తెలిపారు. ఇక ముంబై - అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రారంభించామని 2022-23 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిపారు.