బాపట్ల పార్లమెంట్ నుంచే పోటీ చేస్తా, వెనక్కి తగ్గను
పనబాక లక్ష్మీ గత కొద్ది రోజులుగా వైసీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు అధికార తెలుగుదేశం పార్టీలో కూడా చేరతారంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని బాపట్ల పార్లమెంట్ నుంచే పోటీ చేస్తానని పనబాక లక్ష్మీ క్లారిటీ ఇచ్చారు.
బాపట్ల : రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల నుంచి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి స్పష్టం చేశారు. బాపట్ల ఎంపీ స్థానం నుంచి పోటీకి సిద్ధమని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు.
కేంద్రంలోని బీజేపీకి, ప్రధాని మోదీకి బుద్ధి చెప్పాలంటే జాతీయస్థాయిలో లౌకిక పార్టీలన్ని ఏకం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.పెద్దనోట్ల రద్దు, జీఎస్టీతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పుకొచ్చారు.
తిరుపతి వెంకన్నసాక్షిగా ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని మాయమాటలు చెప్పి రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా సక్రమంగా ఇవ్వడం లేదని మండిపడ్డారు. బీజేపీ పాలనలో దేశంలో ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని విమర్శించారు.
రైతు రుణమాఫీ, డ్వాక్రా గ్రూపులకు 2 లక్షల వరకు రుణాల మాఫీ, పేదకుటుంబాలకు సంవత్సరానికి 4 గ్యాస్ సిలెండర్లు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు.
అయితే పనబాక లక్ష్మీ గత కొద్ది రోజులుగా వైసీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు అధికార తెలుగుదేశం పార్టీలో కూడా చేరతారంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని బాపట్ల పార్లమెంట్ నుంచే పోటీ చేస్తానని పనబాక లక్ష్మీ క్లారిటీ ఇచ్చారు.