యువకుడి తల నరికి ఫ్రిజ్ లో పెట్టి దాన్ని చూస్తూ మద్యం తాగారు
మద్యం తాగించి సతీష్ ను వ్యాపారి తన బైక్పై కూర్చోబెట్టుకుని షాపులో పనిచేసే యువకుడి సాయంతో అర్ధరాత్రి నేరుగా పోణంగి రోడ్డులో తమ్మిలేరు కాలువ గట్టుపైకి తీసుకెళ్లాడు. ఇద్దరు కలిసి సతీష్ ను హత్య చేశారు.
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత కిరాతకమైన సంఘటన వెలుగు చూసింది. యువకుడి తలను నరికి దాన్ని ఫ్రిజ్ లో పెట్టి దాన్ని చూస్తూ నిందితులు ప్రతి రోజూ మద్యం సేవిస్తూ వచ్చారు. ఈ నెల 17న ఏలూరు సమీపంలో పోణంగి రోడ్డు తమ్మిలేరు కాలువలో పోలీసులకు తలలేని మొండెం లభించింది. దాంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, కేసును ఛేదించారు
వివరాలు ఇలా ఉన్నాయి.... ఏలూరు నవాబుపేటకు చెందిన కంచి సతీష్(32) కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. సతీష్ నివాసం ఉంటున్న ప్రాంతంలోకి ఒక పచారి వ్యాపారి(30) తరచుగా వస్తుండేవాడు. దాంతో ఎందుకు వస్తున్నావంటూ సతీష్ నిలదీశాడు.
ఆ వ్యాపారికి అప్పటికే ఆ ప్రాంతంలోని ఒక ఉద్యోగినితో వివాహేతర సంబంధం ఉంది. తనను నిలదీయడంతో సతీష్ కు కూడా ఆమెతో వివాహేతర సంబంధం ఉందని ఆ వ్యాపారి అనుమానించాడు. దీంతో సతీష్ ను చంపేందుకు పథకం రచించాడు.
తన షాపులో పని చేసే యువకుడిని తనకు సాయం చేసేందుకు పెట్టుకున్నాడు. వెంకటాపురం పంచాయతీలో ఒక అపార్టుమెంటులోని ఫ్లాట్ను ఆ వ్యాపారి గెస్ట్ హౌస్ లా వాడుకుంటున్నాడు.మద్యం తాగడానికి ఆ ఫ్లాట్కు సతీష్ ను పిలిచాడు.
మద్యం తాగించి సతీష్ ను వ్యాపారి తన బైక్పై కూర్చోబెట్టుకుని షాపులో పనిచేసే యువకుడి సాయంతో అర్ధరాత్రి నేరుగా పోణంగి రోడ్డులో తమ్మిలేరు కాలువ గట్టుపైకి తీసుకెళ్లాడు. ఇద్దరు కలిసి సతీష్ ను హత్య చేశారు. తల నరికి మొండాన్ని అక్కడే పడేశారు.
తలను మూటకట్టుకొని గెస్ట్హౌస్కు తీసుకెళ్లి ఫ్రిజ్లో పెట్టారు. రోజూ ఆ తలను చూస్తూ మద్యం తాగినట్టు నిందితులు పోలీసులకు చెప్పారు. తర్వాత భయంతో తలను ఓ కాలువలో పడేశామని చెప్పారు. ఏలూరు రూరల్ పోలీసులు మంగళవారం రాత్రి ఆ తలను స్వాధీనం చేసుకున్నారు.