నేను దరఖాస్తు చేయలేదు: ఓటు తొలగింపుపై వైఎస్ వివేకా ఫైర్
తన ఓటు తొలగించాలని దాఖలైన నకిలీ దరఖాస్తుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఫైరయ్యారు.
తన ఓటు తొలగించాలని దాఖలైన నకిలీ దరఖాస్తుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఫైరయ్యారు. ఓట్ల తొలగింపు అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన సోమవారం ఉదయం పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనంతరం వివేకా మీడియాతో మాట్లాడారు. తనకు తెలియకుండా... తన పేరు మీదే ఓటు తొలగించాలని దరఖాస్తు చేయడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఏడాదిన్నర నుంచే ఓట్ల తొలగింపుపై వ్యూహరచన జరిగిందని... రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల ఓట్లు తొలగించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వివేకా మండిపడ్డారు.
ఓట్లు తొలగించడమంటే ప్రజల హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. ఈ అంశంలో ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. వైఎస్ వివేకానందరెడ్డి ఓటు తొలగించాలంటూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శనివారం తహశీల్దార్ కార్యాలయానికి ఆన్లైన్లో దరఖాస్తు చేశారు.
దీనిపై పులివెందులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. సర్వే ఆధారంగా పలు నియోజకవర్గాల్లోని వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలిగించాలంటూ ఆన్లైన్లో భారీగా దరఖాస్తులు వస్తున్నాయి.
మరోవైపు హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొన్ని డేటా సెంటర్లలో ఏపీకి సంబంధించిన ఓటర్ల లిస్టుల లీక్ వ్యవహారం ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది.
జగన్ బాబాయ్ ఓటుకే ఎసరు... ఆయనకు తెలియకుండానే ఈసికి ఫిర్యాదు