కేటీఆర్ టైమ్ మిషన్ ఎక్కారా, దొంగతో స్నేహం మిమ్మల్ని దొంగను చేసిందే : లోకేష్ ఫైర్
టీడీపీ సమాచారం కోసం వారం రోజుల పాటు ఉద్యోగులను వేధించారని లోకేష్ ఆరోపించారు. మా డేటా ఎత్తుకెళ్లి ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అంటున్నారని మండిపడ్డారు. లక్షల కోట్ల దొంగతో స్నేహం మిమ్మల్ని కూడా దొంగను చేసిందంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గిరాజేస్తున్న డేటా చోరీ అంశం ఏపీ మంత్రి నారా లోకేష్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల మధ్య వార్ కి దారి తీస్తోంది. కేటీఆర్, లోకేష్ లు ఒకరిపై ఒకరు ట్విట్టర్ వేదికగా దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తాజాగా కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ డేటా పోయిందని కేటీఆర్ కలగన్నారా అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. ఏపీ సమాచారం పోలేదని ప్రభుత్వమే స్పష్టం చేసిందన్న విషయాన్ని గ్రహించాలన్నారు. ఓటరు జాబితా సమాచారమంతా పబ్లిక్ డేటాయేనని ఎన్నికల సంఘమే తెలిపిందని గుర్తు చేశారు.
ఈ మొత్తం వ్యవహారంలో పోయింది ఏపీ డేటా కాదని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అని చెప్పుకొచ్చారు. కేటీఆర్ టైమ్ మిషన్ ఏమైనా ఎక్కారా అంటూ సెటైర్ వేశారు. మార్చి 2న కేసు నమోదైతే ఫిబ్రవరి 23న ఐటీ గ్రిడ్స్పై ఎలా దాడిచేశారని ప్రశ్నించారు.
టీడీపీ సమాచారం కోసం వారం రోజుల పాటు ఉద్యోగులను వేధించారని లోకేష్ ఆరోపించారు. మా డేటా ఎత్తుకెళ్లి ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అంటున్నారని మండిపడ్డారు. లక్షల కోట్ల దొంగతో స్నేహం మిమ్మల్ని కూడా దొంగను చేసిందంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
మా డేటా ఎత్తుకెళ్లిపోయి...'`ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే`` అంటున్నారు. సావాస దోషం మరి! లక్షల కోట్ల దొంగతో స్నేహం మిమ్మల్నీ దొంగని చేసింది. #TSGovtStealsData#KTRLies
— Lokesh Nara (@naralokesh) March 5, 2019
అంతకుముందు ఐటీ గ్రిడ్ వ్యవహారంపై కేటీఆర్ ట్విట్టర్ ద్వారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ''మీరు ఏ నేరం చేయకపోతే ఈ ఉలికిపాటు ఎందుకు? తెలంగాణ పోలీసుల విధి నిర్వహణకు ఏపి పోలీసుల అడ్డంకులు ఎందుకు? కోర్టులో తప్పుడు పిటిషన్లు ఎందుకు? విచారణ జరిగితే డేటా దొంగతనం బయటపడుతుంది అనే కదా మీ భయం @ncbn గారూ?'' అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
మరో ట్వీట్ లో '' పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన ఏపి ప్రభుత్వం ఆ సమాచారాన్ని ఒక ప్రైవేటు కంపెనీకి చేరవేయటం ప్రైవసీ చట్టానికి తూట్లు పొడవటమే. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద ఏడుపులు ఎందుకు @ncbn గారూ?'' అంటూ కేటీఆర్ ఏపి ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. మెుత్తానికి ఏపీ, తెలంగాణల మధ్య మెుదలైన ఈ డేటా చోరీ లడాయి ఇంకెంత వివాదాన్ని రాజేస్తోందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.