బెంగళూరులో టీటీడీ కార్తీక దీపోత్సవం.. కర్ణాటక సీఎంకు ఆహ్వానం
దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచారం నిర్వహిస్తోందని చెప్పారు. విశాఖపట్నం సాగర తీరాన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించామని చెప్పారు.
కార్తీక మాసం సందర్భంగా.. బెంగళూరులో ఈ నెల 22వ తేదీన టీటీడీ( తిరుమల తిరుపతి దేవస్థానం) అధికారులు కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నారు. టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగనుంది. కాగా.. ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బసవ రాజ్ బొమ్మైని ఆహ్వానించారు. కాగా.. ఆయన ఆహ్వానం మేరకు తప్పకుండా హాజరౌతానని సీఎం బసవరాజ్ బొమ్మై కూడా చెప్పడం గమనార్హం.
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం శ్రీ సుబ్బారెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రికి మర్యాద పూర్వకంగా అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి టీటీడీ ధార్మిక కార్యక్రమాల గురించి అడిగారు. ఈ సందర్భంగా శ్రీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచారం నిర్వహిస్తోందని చెప్పారు. విశాఖపట్నం సాగర తీరాన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించామని చెప్పారు.
Also Read: కమలాపురం మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తత: టీడీపీ నేతల హౌస్ అరెస్ట్, ఉద్రిక్తత
కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 19వ తేదీ తిరుపతి, 22వ తేదీ బెంగుళూరు, 29వ తేదీ విశాఖపట్నం లో భారీ ఎత్తున కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. గో సంరక్షణ, గో ఆధారిత వ్యవసాయం పై టీటీడీ చేస్తున్న కృషిని శ్రీ సుబ్బారెడ్డి వివరించారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గత నెల 12వ తేదీ
ఎ పి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎస్వీబీసీ కన్నడ ఛానల్ ప్రారంభించామని చైర్మన్ తెలిపారు.
ఈ ప్రసారాలకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని శ్రీ సుబ్బారెడ్డి వివరించారు. కన్నడ చానల్ లో దాస సాహిత్య కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని ముఖ్యమంత్రి టీటీడీ ఛైర్మన్ ను కోరారు. ఇందుకు చైర్మన్ సానుకూలంగా స్పందించారు. టీటీడీ చేప్పట్టిన హిందూ ధార్మిక కార్యక్రమాలను కర్ణాటక ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమాలకు కర్ణాటక ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ శశిధర్, శ్రీ విశ్వనాథ రెడ్డి తో పాటు పలువురు కర్ణాటక మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.