ప్రభుత్వం కూలిపోవాలనేది కొందరి ఆలోచన.. విజయ్కుమార్ స్వామి గురించి తప్పుడు ప్రచారం: వైవీ సుబ్బారెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వెంటనే కూలి పోవాలనేది కొంతమంది ఆలోచన అని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వెంటనే కూలి పోవాలనేది కొంతమంది ఆలోచన అని మండిపడ్డారు. వైవీ సుబ్బారెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. విజయ్ కుమార్ స్వామితో తనకు 2007 నుంచి పరిచయం ఉందని అన్నారు. ఎంతో మంది స్వామిజీలను తీసుకొచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఆశీర్వాదాలు ఇప్పిస్తుంటానని చెప్పారు. విజయ్ కుమార్ స్వామి గురించి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
విజయ్ కుమార్ స్వామి ఎవరి విమానంలో విజయవాడకు వచ్చారని ప్రశ్నించారు. విజయ్ కుమార్ స్వామి వచ్చిన విమానం రామోజీ బంధువేదనని అన్నారు. విజయ్ కుమార్ స్వామి అంటే అందరికి భక్తి భావమేనని అన్నారు. విజయ్ కుమార్ స్వామి వచ్చి సీఎం జగన్కు ఆశీర్వాదం అందించారని చెప్పారు. విజయ్ కుమార్ స్వామి లాబీయింగ్కు వచ్చారని దుష్ప్రచారం చెయ్యడం మంచిది కాదని అన్నారు. స్వామిజీలు, దేవుళ్ల విషయంలో నీచ రాజకీయాలు వద్దని అన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సంబంధించి విచారణ జరుగుతోందని వైవీ సుబ్బారెడ్డి గుర్తుచేశారు. కోర్టులు ఎవరు ఏంటి అనేది నిర్ణయిస్తాయని చెప్పారు. సీబీఐ విచారణ పక్షపాత ధోరణితో జరుగుతోందనేది కొన్ని సంఘటనలు చూస్తే అర్ధం అవుతుందని అన్నారు. విచారణ వ్యక్తిగతంగా టార్గెట్ చేసేలా ఉండకూడదని అన్నారు. అవినాష్ రెడ్డి బయటపెట్టిన కొన్ని నిజాలను సీబీఐ పరిగణలోకి తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. అంతిమంగా న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని చెప్పారు.