YSRCP 7th List: వైసీపీ ఏడో జాబితా విడుదల.. అభ్యర్థులు వీరే..
YSRCP 7th List: ఎన్నికలు సమీపిస్తున్న ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ వైఎస్సార్ సీపీ (YSRCP) ఇదివరకే సమన్వయకర్తల 6 జాబితాలు విడుదల చేసింది. తాజాగా 7వ జాబితా విడుదల చేసింది.
YSRCP 7th List: ఏపీలో రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని అటూ అధికార వైసీపీ, ఇటూ ప్రతి పక్ష బీజేపీ, జనసేన, టీడీపీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో అధికార వైఎస్ఆర్సీపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. తన పార్టీలో ఇంఛార్జీల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆరు జాబితాలు ప్రకటించిన వైసీపీ.. తాజాగా శుక్రవారం రాత్రి ఏడో జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎడం బాలాజీని, కందుకూరుకు కటారి అరవిందా యాదవ్ను పార్టీ సమన్వయ కర్తలుగా అధిష్టానం నియమించింది.
తాజా జాబితాలో ఇద్దరు పేర్లను మాత్రమే ప్రకటించారు. కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి మొండి చేయి చూపించి.. అతని స్థానంలో మహిళా నేత అరవిందా యాదవ్ ను ఇంఛార్జ్ గా నియమించారు. అలాగే..పర్చూరు నుంచి పోటీ చేయడానికి ఆమంచి కృష్ణమోహన్ ఆసక్తి కనబరచకపోవడంతో ఎడం బాలాజీకి పర్చూరు బాధ్యతల్ని అప్పగించారు.
ఇంఛార్జ్ల తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇంఛార్జిలను నియమించగా.. రెండో జాబితాలో 27 స్థానాలకు (మూడు ఎంపీ, 24 అసెంబ్లీ), మూడో జాబితాలో 21 స్థానాలకు (ఆరు ఎంపీ, 15 అసెంబ్లీ), నాలుగో లిస్టులో 8 స్థానాలకు (ఒక ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ), ఐదో జాబితాలో 7 స్థానాలకు (3 అసెంబ్లీ, 4 ఎంపీ) కొత్త ఇంఛార్జిలను నియమించారు. 6వ జాబితాలో 4 పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జిలను ప్రకటిస్తూ వైసీపీ జాబితా విడుదల చేసింది. తాజాగా 7వ జాబితాలో కేవలం 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జీలను ప్రకటించారు.