రఘురామ కృష్ణంరాజు అనర్హత  పిటిషన్‌పై కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు.  

పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ముగిసింది. అనంతరం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ రంగ సంస్థను నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కేంద్రాన్ని కోరామని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశామని ఆయన వెల్లడించారు. ఎనిమిదేళ్లయినా కేంద్రం విభజన చట్టం హామీలను నెరవేర్చలేదని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. తెలుగు ప్రజలందరికీ కేంద్రం ద్రోహం చేస్తోందని ఆయన మండిపడ్డారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Also Read:త్వరలో అంతర్జాతీయ కార్యదర్శి అవుతాడేమో: విజయసాయిరెడ్డిపై రఘురామ వ్యాఖ్యలు

బీజేపీ పక్షపాత ధోరణి అవలంభిస్తోందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందన్నారు. అలాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్స్ కోరామని విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని చెప్పామన్నారు. పెండింగ్‌లో వున్న దిశ బిల్లును ఆమోదించాలని కోరామని విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీకి తెలంగాణ ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలు ఇప్పించాలన్నారు. సీఆర్‌డీఏ, ఏపీ ఫైబర్, రథం తగలబడ్డ అంశాలపై సీబీఐ విచారణ కోరామన్నారు. రఘురామ కృష్ణంరాజు అనర్హత పిటిషన్‌పై కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. పార్లమెంట్‌ సమావేశాల్లో అన్ని అంశాలను లేవనెత్తుతామని ఆయన పేర్కొన్నారు.