ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే 19 ఎంపీ, 133 అసెంబ్లీ స్థానాలు వైసీపీవే : విజయసాయిరెడ్డి
ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 19 ఎంపీ, 133 అసెంబ్లీ స్థానాల్లో గెలిచే సత్తా వుందని ఇండియా టీవీ దేశ్ కీ ఆవాజ్ సర్వే స్పష్టం చేస్తోందన్నారు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. గడప గడపకూ కార్యక్రమంతో వచ్చే 20 నెలల్లో వైసీపీ ప్రభుత్వం మరింత లబ్ధి పొందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 19 ఎంపీ, 133 అసెంబ్లీ స్థానాల్లో గెలిచే సత్తా వుందని ఇండియా టీవీ దేశ్ కీ ఆవాజ్ సర్వే స్పష్టం చేస్తోందన్నారు. గడప గడపకూ కార్యక్రమంతో వచ్చే 20 నెలల్లో వైసీపీ ప్రభుత్వం మరింత లబ్ధి పొందుతుందని.. గతంలో సాధించిన 151 సీట్ల కంటే ఎక్కువ స్థానాలను గెలవడం ఖాయమని విజయసాయిరెడ్డి ఆదివారం ట్వీట్ చేశారు.
అంతకుముందు గురువారం విజయసాయిరెడ్డి న్యూఢిల్లీలో మాట్లాడుతూ.. జగన్ (ys jagan) సమర్థ నాయకత్వం చేతిలో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఏపీ ఆర్ధిక స్థితిపై (ap financial status) కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని.. అసలు రాష్ట్రాల విషయంలో కేంద్రం తీరు సరిగా లేదని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్రం కంటే ఏపీ ఆర్ధిక పరిస్థితే మెరుగ్గా వుందన్న ఆయన 2021-22 సంవత్సరంలో కేంద్రం జీడీపీ 57 శాతంగా వుందని.. ఏపీ జీడీపీ ఐదో స్థానంలో వుందని తెలిపారు. ఎక్స్పోర్ట్స్ విషయంలోనూ ఏపీ ఎంతో అభివృద్ధి సాధించిందని... కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల ఆదాయం తగ్గిందని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
Also REad:జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో ఏపీకి మూడవ స్థానం... జగన్ చిత్తశుద్ధికి నిదర్శనమన్న విజయసాయి
కేంద్రానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం పెరిగినా రాష్ట్రాలకు మాత్రం సరైన వాటా ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. 41 శాతం వాటా ఇస్తున్నామన్న కేంద్రం మాటల్లో వాస్తవం లేదని.. సెస్, సర్ ఛార్జీలను కేంద్రం ఏటా పెంచుతోందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. కానీ ఆ ఆదాయం మాత్రం ఇవ్వడం లేదని... రాష్ట్రాల అప్పులపై గురించి కాదని, ముందు తన అప్పుల సంగతి ఏం చెబుతారని ఆయన చురకలు వేశారు. 2014 నుంచి 19 మధ్య కాలంలో కేంద్రం అప్పులు 60 శాతం పెరిగితే... చంద్రబాబు సీఎంగా వుండగా ఏపీలో 117 శాతం అప్పుటు పెరిగాయని విజయసాయిరెడ్డి వెల్లడించారు. 2019 నుంచి ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో 43 శాతం అప్పులు మాత్రమే పెరిగాయని ఆయన పేర్కొన్నారు. బాబు ప్రభుత్వం ఐదుగురు కోసం పనిచేస్తే.. జగన్ ప్రభుత్వం 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేస్తుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.