ఎంపీలకు రఘురామకృష్ణంరాజు విందు: జగన్కు ఏం చెప్పదలచుకున్నారు
నర్సాపురం వైసీపీ ఎంపీ రఘరామ కృష్ణంరాజు బుధవారం ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులకు విందు ఇస్తున్నారు. సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ అధ్యక్షుడి హోదాలో ఆయన ఈ విందును ఏర్పాటు చేశారు
నర్సాపురం వైసీపీ ఎంపీ రఘరామ కృష్ణంరాజు బుధవారం ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులకు విందు ఇస్తున్నారు. సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ అధ్యక్షుడి హోదాలో ఆయన ఈ విందును ఏర్పాటు చేశారు.
ఢిల్లీ జన్పథ్, లాన్స్ ఆఫ్ వెస్టర్న్ కోర్టులోని ఆయన వియ్యంకుడు కేవీపీ రామచంద్రరావు నివాసంలో ఈ విందు జరగనుంది. ఈ కార్యక్రమానికి మొత్తం 300 మంది ఎంపీలు హాజరవుతారని రఘురామకృష్ణంరాజు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
Also Read:ఢిల్లీ కేంద్రంగా వైసీపీలో కుదుపు: ఆ ఎంపీ వల్ల జగన్ కు టెన్షన్
మరోవైపు ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా హాజరవుతారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ.. వారిని ఆహ్వానించలేదని, కేవలం కొందరు కేంద్రమంత్రులు మాత్రం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా రఘురామకృష్ణంరాజు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండటంతో పాటు.. తాను హెచ్చరించినప్పటికీ ప్రధాని మోడీ, ఇతర కేంద్ర మంత్రుల్ని కలుస్తుండటంతో జగన్ ఆగ్రహంతో ఉన్నారు.
ఈ క్రమంలోనే రఘరామకృష్ణంరాజుకు చెక్ పెట్టేందుకు గాను పశ్చిమగోదావరి జిల్లాలో బలమైన నేతగా ఉన్న మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుమారుడు రంగరాజును, ఆయన సోదరులు నరసింహరాజు, రామరాజులను జగన్ వైసీపీలో చేర్చుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Also Read:మోదీని కలిస్తే తప్పా, అడక్కుండానే వివరణ ఇచ్చా: జగన్ తో భేటీపై ఎంపీ రఘురామకృష్ణంరాజు
2024 సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం నుంచి రంగరాజుకు అవకాశమిస్తానని జగన్ హమీ ఇచ్చారని దాని సారాంశం. ఈ క్రమంలో రఘురామకృష్ణంరాజు ఇస్తున్న విందు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.