Asianet News TeluguAsianet News Telugu

AP Legislative council: ఏపీ శాసన మండలి చైర్మన్‌గా మోషేన్ రాజు.. సంతోషంగా ఉందన్న సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (ap legislative council) చైర్మన్‌గా కొయ్యే మోషేన్‌రాజు (Koyye Moshen Raju) ఎన్నికయ్యారు.  ప్రొటైం చైర్మన్ బాలసుబ్రహ్మణం మోషేన్ రాజు మండలి చైర్మన్‌గా ఎన్నికైనట్లుగా అధికారికంగా ప్రకటించారు.

YSRCP MLC Moshen Raju elected as chairman of the Andhra Pradesh Legislative Council
Author
Amaravati, First Published Nov 19, 2021, 4:19 PM IST

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (ap legislative council) చైర్మన్‌గా కొయ్యే మోషేన్‌రాజు (Koyye Moshen Raju) ఎన్నికయ్యారు. శాసన మండలి చైర్మన్‌గా మోషేన్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రొటైం చైర్మన్ బాలసుబ్రహ్మణం మోషేన్ రాజు మండలి చైర్మన్‌గా ఎన్నికైనట్లుగా అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయన మండలి చైర్మన్‌గా బాధ్యతల స్వీకరించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మోషేన్ రాజు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారు.  ఎమ్మెల్సీగా ఎంఏ షరీఫ్‌ పదవీకాలం ముగియడంతో మండలి చైర్మన్‌ పదవి ఖాళీ అయ్యింది. దీంతో మండలి చైర్మన్‌ ఎన్నికకు గురువారం కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు నోటిఫికేషన్‌ జారీ చేశారు.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ మండలి చైర్మన్ పదవికి YSRCP తరఫున మోషేన్‌రాజు పోటీల నిలిపారు. ఈ క్రమంలోనే వైసీపీ అభ్యర్థిగా మోషేన్‌రాజు గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. టీడీపీ పోటీకి దూరంగా ఉంది. దీంతో ఒక్కటే నామినేషన్ దాఖలైన నేపథ్యంలో మోషేన్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో మండలి చైర్మన్‌గా వ్యవహరించిన  ఎంఏ షరీఫ్‌ కూడా పశ్చిమ గోదావరికి చెందిన వ్యక్తే.

శాసనమండలి చైర్మన్‌గా కొయ్యే మోషేన్‌రాజు ఎన్నికవ్వడం చాలా సంతోషంగా ఉందని సీఎం వైఎస్ జగన్ (YS Jagan) అన్నారు. మోషేన్‌రాజుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. పదేళ్లుగా మోషేన్ రాజు తనతో కలిసి ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. తన తండ్రి ఉన్నప్పటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. మోషేన్ రాజు చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. స్థానిక సంస్థల నుంచి రాజకీయాల్లోకి వచ్చినవారికి అన్ని అంశాలపై అవగాహన ఉంటుందని అన్నారు. 

పశ్చిమ గోదావరి (west godavari) జిల్లా భీమవరంలోని గునుపూడికి చెందిన మోషేన్ రాజు.. 1965 ఏప్రిల్ 10వ తేదీన జన్మించారు. ఆయన డిగ్రీ పూర్తిచేశారు. 1987 నుంచి వరుసగా నాలుగుసార్లు భీమవరం మునిసిపల్‌ కౌన్సిలర్‌గా, రెండుసార్లు ఫ్లోర్‌ లీడర్‌గా పనిచేశారు. 2009లో కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.  ఆ సమయంలో తన పదవికి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున కొవ్వూరు నియోకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయనకు వైఎస్ జగన్‌కు సన్నిహితుడనే గుర్తింపు ఉంది. ఈ క్రమంలోనే మోషేన్ రాజుకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios