ఫంక్షన్లలో ఎంజాయ్ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు.. అరెస్ట్పై పోలీసులపై మౌనం, విమర్శలు
వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణం అనుమానస్పద మృతి నేపథ్యంలో కాకినాడలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీని వెంటనే అరెస్ట్ చేయాలని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే అనంతబాబు మాత్రం పెళ్లిళ్లు, ఫంక్షన్లలో ఎంజాయ్ చేస్తున్నారు.
తన మాజీ డ్రైవర్ మృతి కేసులో (subramanyam dead body) ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు (ysrcp mlc ananthababu) పెళ్లిళ్లకు , ఫంక్షన్లకు వెళుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు ఆయన అరెస్ట్ కోసం నిన్నటి నుంచి డ్రైవర్ కుటుంబ సభ్యులు, ప్రతిపక్ష పార్టీలు, దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్సీపై ఈ స్థాయిలో ఆరోపణలు వస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని.. అతను ఎక్కడున్నాడో తెలిసి వదిలేస్తున్నారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గురువారం రాత్రి డ్రైవర్ సుబ్రమణ్యం చనిపోతే.. శుక్రవారం రెండు పెళ్లిళ్లకు హాజరయ్యారు ఎమ్మెల్సీ అనంత బాబు. పెళ్లిళ్లలో పాల్గొనడమే కాకుండా దర్జాగా ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణం అనుమానస్పద మృతి నేపథ్యంలో కాకినాడలో (ggh kakinada) ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీని వెంటనే అరెస్ట్ చేయాలని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. దళిత ప్రజా సంఘాలు, పలు ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో శనివారం కాకినాడ జీజీహెచ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం సుబ్రహ్మణ్యం మృతదేహం ఉన్న కాకినాడ జీజీహెచ్ వద్దకు తెలుగుదేశం పార్టీ (telugu desam party) ఏర్పాటు చేసిన నిజ నిర్దారణ బృందం (fact finding committee) వెళ్లింది.
Also Read:కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత.. మార్చురీ గదికి వెళ్తున్న టీడీపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు
అయితే టీడీపీ నాయకులు మార్చురీ గదికి వెళ్లకుండా పోలీసులు అడ్డకుంటున్నారు. ఈ క్రమంలోనే ముందుకు వెళ్లకుండా ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ వెళ్లేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే టీడీపీ నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో తోపులాట చోటుచేసుకోవడంతో పలువురికి గాయాలు అయ్యాయి. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.
సుబ్రహ్మణ్యం మృతికి సంబంధించి కాకినాడ జీజీహెచ్ వద్ద పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. ఇందులో ఒత్తిడి తమపై లేదన్నారు. ఈ కేసులో పోలీసులు, ప్రభుత్వం నిష్పాక్షపాతంగా పనిచేస్తుందన్నారు. తొలుత శవ పంచానామా జరిగి, పోస్టుమార్టమ్ జరిగితేనే కేసు దర్యాప్తు సాగుతుందన్నారు. పోస్టుమార్టమ్లో మృతికి గల ప్రాథమిక కారణం తెలుస్తుందన్నారు. 174 కింద అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేశామన్నారు. తొలుత శవ పంచానామాకు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు సంతకాలు పెట్టాలన్నారు. పోస్టుమార్టం జరిగేలా సహకరించాలని కోరుతున్నట్టుగా చెప్పారు. వారికి అనుమానాలు ఉంటే తమ వద్ద చెప్పాలని కోరారు.