Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణికి కరోనా: ఫోన్ చేయొద్దు.. పరామర్శకు రావొద్దంటూ విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రముఖులు సైతం బాధితులుగా మారుతున్నారు. తాజాగా వైసీపీ నేత, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి చేరారు. ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది

ysrcp mla shilpa chakrapani reddy tested for coronavirus
Author
Srisailam, First Published Jul 17, 2020, 4:52 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రముఖులు సైతం బాధితులుగా మారుతున్నారు. తాజాగా వైసీపీ నేత, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి చేరారు. ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. దీంతో శిల్పా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.

ఇటీవల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన చక్రపాణిరెడ్డి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. ఈ క్రమంలో ఆయన స్వల్ప అస్వస్థతకు గురికావడంతో నంద్యాలలోని స్వగృహంలో విశ్రాంతి  తీసుకున్నారు.

ముందు జాగ్రత్తగా నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఆర్టీ పీఆర్‌సీ పరీక్షల ఫలితం వచ్చేసరికి 3 రోజులు పట్టింది. అప్పటి వరకు హైదరాబాద్‌లోని ఇంట్లో హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు.

ఎట్టకేలకు శుక్రవారం వచ్చిన ఫలితాల్లో కరోనా పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఎమ్మెల్యే ఆసుపత్రి క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. తనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో శిల్పా స్పందించారు.

ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని.. ఎవరూ పరామర్శకు రావొద్దని పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటించాలంటూ లేఖ విడుదల చేశారు. 

"నా ప్రియమైన శ్రీశైలం నియోజకవర్గం మరియు రెండు తెలుగు రాష్ట్రాల్లోని  ప్రజలు, బంధు మిత్రులందరికీ ... మీ శిల్పా చక్రపాణి రెడ్డి తెలియజేయడం ఏమనగా ... స్వల్ప అనారోగ్యం వల్ల సందేహం వచ్చి కరోనా పరీక్షలు చేయించుకున్నాను . 

ఈ పరీక్షల్లో నాకు పాజిటివ్ అని తేలింది. దీంతో నేను క్వారంటైన్ లో తగిన చికిత్స చేయించుకుంటున్నాను. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యం తో ఉన్నాను . అయినప్పటికీ covid పరీక్షల్లో నెగటివ్ వచ్చేంతవరకు నేను క్వారంటైన్ లోనే ఉండవలసిన అవసరం ఉంది . 

ఈ సందర్బంగా నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేయడం ఏమనగా ...  చికిత్స కాలం ముగిసే వరకూ నన్ను పరామర్శించేందుకు ఎవరూ రావద్దు . కనీసం ఫోన్ లో కూడా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయవద్దు . ఏమైనా update ఉంటే నేను స్వయంగా సోషల్ మీడియా ద్వారా మీకు తెలియజేస్తాను.

మరో ముఖ్యమైన అంశం ఏమంటే .. గడిచిన కొన్ని దినాలుగా నాతో సన్నిహితంగా మెదిలిన  బంధు మిత్రులకు కూడా పరీక్షలు చేయించడం జరిగింది . వారందరికీ నెగటివ్ వచ్చింది . 

ఇటీవల నేను నియోజకవర్గం లో పర్యటించినప్పుడు నాతో కలిసి ప్రయాణించిన వారు , సన్నిహితంగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే తక్షణమే పరీక్షలు చేయించుకొన గలరు . కోవిడ్ లక్షణాలు ఏమున్నా వెంటనే వైద్యాధికారులను సంప్రదించండి . 

జన సమూహం లోకి వచ్చినప్పుడు ... సామాజిక దూరం పాటించమని , మాస్కులు ధరించమని నేను పదే పదే మీకు విజ్ఞప్తి చేసిన సంగతి మీకు విదితమే . కనుక ఇప్పటికైనా కరోనా ప్రోటోకాల్ పాటించి మిమ్మల్ని మీరు ఈ మహమ్మారి నుంచి రక్షించుకోవాలి అని చేతులెత్తి మరీ వేడుకుంటున్నాను . 

....మీ అందరి ఆశీస్సులు , ప్రార్థనలు ఆశిస్తూ ... ఎల్లవేళలా మీ క్షేమాన్ని కోరుకునే ..
మీ శిల్పా చక్రపాణి రెడ్డి ,
ఎమ్మెల్యే , శ్రీశైలం"

Follow Us:
Download App:
  • android
  • ios