54 కంపెనీలకు నోటీసులిచ్చాం.. వాటి గురించి మాట్లాడరేం: అమరరాజా ఇష్యూపై రోజా సంచలన వ్యాఖ్యలు
అమరరాజాకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. రాష్ట్రంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న 54 పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు ఇస్తే.. చంద్రబాబు మాత్రం ఒక అమరరాజా గురించే మాట్లాడడం సిగ్గుచేటంటూ రోజా ఎద్దేవా చేశారు
గత నాలుగైదు రోజులుగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్కు చెందిన ‘అమరరాజా’ ఫ్యాక్టరీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అమరరాజా’ విషయంలో టీడీపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న 54 పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు ఇస్తే.. చంద్రబాబు మాత్రం ఒక అమరరాజా గురించే మాట్లాడడం సిగ్గుచేటంటూ రోజా ఎద్దేవా చేశారు. ఇది రాజకీయం కాదు.. కాలుష్యం సమస్యగా మాత్రమే చూడాలని ఆమె హితవు పలికారు. నిబంధనలు పాటించని పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ మండలి బోర్డు నోటీసులు ఇచ్చిందన్న విషయాన్ని రోజా గుర్తు చేశారు.
Also Read:గల్లా జయదేవ్ కుటుంబానికి షాక్.. అమరరాజాలో తక్షణం ఉత్పత్తి నిలిపివేయండి, పీసీబీ ఆదేశాలు
గాలి, నీరు, భూమి పూర్తిగా కలుషితమైందని.. అమరరాజా అనేక మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఆమె ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలను శిరసా వహించి కంపెనీ తన తప్పును సరిదిద్దుకోవాలి రోజా హితవు పలికారు. తెలంగాణలో కూడా ఎన్ని పరిశ్రమలకు నోటీసులు ఇచ్చారో తెలుసుకుని మాట్లాడాలని.. పరిశ్రమలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. అమరరాజా కంపెనీని జగన్ ప్రభుత్వం మూసివేయాలని చెప్పలేదని... కేవలం తప్పులను సరిదిద్దుకుని నియమ నిబంధనలతో పరిశ్రమలు నడిపించాలని అమరరాజా ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అధికారులు కోరారు అని రోజా చెప్పుకొచ్చారు.