గల్లా జయదేవ్ కుటుంబానికి షాక్.. అమరరాజాలో తక్షణం ఉత్పత్తి నిలిపివేయండి, పీసీబీ ఆదేశాలు
అమరరాజా బ్యాటరీస్ సంస్థకు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ షాకిచ్చింది. అమరరాజా బ్యాటరీస్లో ఉత్పత్తి నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏ పరిశ్రమనూ మూసివేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, పర్యావరణానికి హానీ జరగకుండా ఉత్పత్తి చేసుకోవచ్చని తెలిపింది
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్కు చెందిన అమరరాజా బ్యాటరీస్ సంస్థలో ఉత్పత్తి నిలిపివేస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కంపెనీ నుంచి విడుదలయ్యే సీసంతో కూడిన నీటిని మొక్కల పెంపకానికి వినియోగిస్తోందని.. దీని వల్ల మొక్కలతో పాటు జంతు జాలానికి, మానవ మనుగడకు ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేసింది. రెండు పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యపు నీరు మల్లె మడుగు రిజర్వాయర్, ఆ సమీపంలోని మరో నీటి వనరుకు వెళుతున్నట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గుర్తించింది. అంతేకాకుండా వర్షం కురిసిన సమయంలో భూగర్భ జలాలు మరింత కలుషితమవుతున్నట్లు తెలిపింది.
Also Read:తెలంగాణతో ఘర్షణ కోరుకోవడం లేదు.. అమరరాజా ఏపీలోనే ఉండాలి: బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు
మరోవైపు పరిశ్రమలకు నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో సీసం కలుషితం చేసిందని సాంకేతిక కమిటీ నిర్ధారించింది. అంతేకాకుండా గాలిలోకి 137 మరల ద్వారా సీసీపు ధూళిని విడుదల చేస్తున్నట్లు గుర్తించింది. ప్రతి ఆరు నెలలకోసారి సీసం నమూనాలను పీసీబీకి ఇవ్వాల్సి వుండగా.. ఒక్కసారి కూడా సమర్పించలేదని ఆరోపించింది. పూర్తి స్థాయిలో దీనిపై అధ్యయనం చేయాలని.. కోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగినట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది. ఏ పరిశ్రమనూ మూసివేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, పర్యావరణానికి హానీ జరగకుండా ఉత్పత్తి చేసుకోవచ్చని తెలిపింది. అమరరాజా కంపెనీ కాలుష్య నివారక ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలని పీసీబీ సూచించింది.