వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై దాడి ఘటనలో ఆడియోల కలకలం
తిరుపతి వంటి పుణ్యక్షేత్రంలో హత్యకు ప్లాన్ చేశారని ఆరోపించారు. ఎప్పుడూ లేని సంస్కృతి చంద్రగిరి, తిరుపతిలో తీసుకొచ్చారని విమర్శించారు. తనపై జరిగిన రెక్కీ, ఇతర ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.
తిరుపతి: తనను హత్య చేసేందుకు చంద్రగిరి తెలుగుదేశం పార్టీనేతలు కుట్రపన్నారని చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. తనపై జరిగిన దాడి కుట్రపూరితంగానే జరిగిందని హత్య చేసేందుకే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈనెల3న రెక్కీ నిర్వహించి తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. రెక్కీ చేసిన డ్రైవర్, మరో వ్యక్తి మాట్లాడిన వీడియోను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాకు విడుదల చేశారు.
తిరుపతి వంటి పుణ్యక్షేత్రంలో హత్యకు ప్లాన్ చేశారని ఆరోపించారు. ఎప్పుడూ లేని సంస్కృతి చంద్రగిరి, తిరుపతిలో తీసుకొచ్చారని విమర్శించారు. తనపై జరిగిన రెక్కీ, ఇతర ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.
చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం అగ్రహారంలో పసుపు కుంకుమ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎమ్మెల్యే హోదాలో ప్రసంగిస్తుండగా ఆయన ప్రసంగాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుకున్నారు.
టీడీపీ కార్యక్రమంలో మీ ప్రసంగాలు ఏంటంటూ నిరసనకు దిగారు. అధికారులు వారిస్తున్నా వినకుండా కొందరు చెవిరెడ్డి పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఎమ్మెల్యే చెవిరెడ్డికి పోలీసులు, మహిళలు రక్షణగా నిలిచారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులు, మహిళలపై రాళ్లు, కారం పొడి, స్వీట్ ప్యాకెట్లతో దాడి చేశారు.
దాడిలో ఎమ్మెల్యేతో పాటు తిరుపతి వెస్ట్ డీఎస్పీ, ఎంఆర్ పల్లి సీఐ, ముగ్గురు మహిళలకు గాయాలు అయ్యాయి. టీడీపీ నేతలకు, ఎమ్మెల్యేకు మధ్యలో తోపులాట జరగడంతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సృహతప్పి కిందపడిపోయారు.
సృహ తప్పిన ఎమ్మెల్యేని పోలీసులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆడియోలను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఆడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.