నిన్న గన్నవరం.. నేడు హిందూపురం : ఎమ్మెల్సీ ఇక్బాల్కు వ్యతిరేకంగా సీక్రెట్ మీటింగ్.. వైసీపీకి తలనొప్పులు
వైసీపీలో అసమ్మతి నేతలు అధిష్టానానికి తలనొప్పులు తెప్పిస్తున్నారు. ఇటీవలే గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్రరావు మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తాజాగా హిందూపురంలో ఎమ్మెల్సీ ఇక్బాల్కు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు రహస్య మీటింగ్ నిర్వహించారు.
సత్యసాయి జిల్లా (sathya sai district) హిందూపురంలో (hindupur) వైసీపీ (ysrcp) నేతలు రహస్యంగా భేటీ కావడం అధికార పార్టీలో కలకలం రేపుతోంది. స్థానిక ఎమ్మెల్సీ ఇక్బాల్ (iqbal) పార్టీని నాశనం చేస్తున్నారని అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు శనివారం ఓ ప్రైవేట్ కాలేజీలో సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి మాజీ ఎమ్మెల్యే అబ్ధుల్ గని హాజరయ్యారు. అలాగే ఏపీ ఆగ్రోస్ రాష్ట్ర ఛైర్మన్ నవీన్ నిశ్చల్తో పాటు ఎంపీపీలు , 16 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, వైస్ ఛైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని వైసీపీ నేతలు తెలియజేశారు.
Also Read:వల్లభనేని వంశీతో పనిచేయలేం: సజ్జలకు తేల్చి చెప్పిన దుట్టా వర్గం
అయితే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కూడా వైసీపీ అసమ్మతి నేతలు భగ్గుమంటున్నారు. ప్రకాశం జిల్లాలో మంత్రి ఆదిమూలపు సురేష్కి (audimulapu suresh) సొంత నియోజకవర్గం యర్రగొండపాలెంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన తీరుపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా గత వారం పుల్లల చెరువులోని ఓ తోటలో మండల స్థాయి నాయకులు సమావేశం అయ్యారు. ఈ భేటీలో 9 మంది సర్పంచ్లు, ఇద్దరు ఎంపీటీసీలతో పాటూ మరికొందరు వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు.
యర్రగొండపాలెం నియోజకవర్గంలో పనులు చెయ్యకుండా.. గడప గడపకూ వెళ్లి మంత్రి సురేష్ ఏం చెబుతారని ఈ సమావేశంలో వారు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. మంత్రి సురేష్ వలన తాము నష్టపోయామని సమావేశంలో మాజీ ఏఎంసీ ఛైర్మన్ కంచర్ల వీరయ్య కన్నీటి పర్యంతం అయ్యారు. నియోజవర్గంలో ఏ పనులు చేయించుకోలేకపోయామని.. ప్రతిపక్షంలో ఉన్నామా, అధికారంలో ఉన్నామా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అటు గన్నవరం నియోజకవర్గంలో (gannavaram) ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి (vallabhaneni vamsi) , దుట్టా రామచంద్రారావు (dutta ramachandra rao) వర్గానికి మధ్య కొంత కాలంగా గ్యాప్ కొనసాగుతుంది. ఇటీవల కాలంలో ఇది మరింత పెరిగింది. దీంతో ఇరువర్గాలను సీఎం జగన్ తాడేపల్లికి పిలిపించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత దుట్టా రామచంద్రారావు మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీతో కలిసి పనిచేయబోమని స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబానికి సాయం చేయడమే తనకు తెలుసునని చెప్పారు. అవమానాలు భరించి మరొకరి వెంట తిరగాల్సిన అవసరం తమకు లేదన్నారు. వైసీపీ కేడర్ ను వంశీ తొక్కేస్తున్నాడని కూడా దుట్టా రామచంద్రరావు ఆరోపించారు. ఈ కారణంగానే తాను రాజకీయాల్లో యాక్టివ్ గా లేనని కూడా దుట్టా రామచంద్రారావు చెప్పారు.