చంద్రబాబుకు కులగజ్జి పట్టుకుంది: వైసీపీ ఫైర్
తన సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులను కీలక స్థానాల్లో నియమించడమే అందుకు నిదర్శనమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకే సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులకు ప్రమోషన్లు ఇవ్వడం అధికార దుర్వినియోగం కిందకు వస్తుందని ఆరోపించారు.
విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబుకు కుల గజ్జి పట్టుకుందని ఆ పార్టీ నేతలు కోన రఘుపతి, మల్లాది విష్ణులు ఆరోపించారు.
తన సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులను కీలక స్థానాల్లో నియమించడమే అందుకు నిదర్శనమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకే సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులకు ప్రమోషన్లు ఇవ్వడం అధికార దుర్వినియోగం కిందకు వస్తుందని ఆరోపించారు.
శనివారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మల్లాది విష్ణు సర్వేల పేరుతో టీడీపీ బరితెగించి అక్రమాలకు పాల్పడుతోందని ఘాటుగా విమర్శించారు. ఇప్పటికే తమకు వ్యతిరేకులుగా భావిస్తున్న పలువురి ఓట్లను తొలగించిందని ఆరోపించారు.
గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 2 శాతం ఓట్లు అంటే 5 లక్షల ఓట్ల తేడాతో అధికారం కోల్పోయిందని గుర్తు చేశారు. ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అందువల్లే చంద్రబాబు కుయుక్తులతో గెలవాలని చూస్తున్నారని విమర్శించారు.
దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఓట్ల తొలగింపు, బోగస్ ఓట్ల విషయమై తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని తెలిపారు. అలాగే గవర్నర్ నరసింహన్ కు కూడా ఫిర్యాదు చేసినట్లు నేతలు మల్లాది విష్ణు, కోన రఘుపతి స్పష్టం చేశారు.