అవినీతి కేసులో అరెస్ట్.. చంద్రబాబు విప్లవకారుడిలా కనిపిస్తున్నారా : టీడీపీపై సజ్జల ఆగ్రహం
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ను నిరసిస్తూ జరుగుతున్న ఆందోళనలు , ధర్నాలపై ప్రభుత్వ సలహాదారు , వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు . చంద్రబాబు ఓ అవినీతి కేసులో అరెస్ట్ అయితే టీడీపీ నేతలు ఓ విప్లవకారుడిలా బిల్డప్ ఇస్తున్నారని సజ్జల దుయ్యబట్టారు.

స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ను నిరసిస్తూ జరుగుతున్న ఆందోళనలు , ధర్నాలపై ప్రభుత్వ సలహాదారు , వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 9న విజయవాడలో వైసీపీ ప్రతినిధుల సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి దాదాపు 8 వేల మంది పార్టీ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సభ ఏర్పాట్లను ఆదివారం సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సభ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పారు.
గత నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తమ ప్రజాప్రతినిధులు గడప గడపకూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని సజ్జల తెలిపారు. చంద్రబాబు ఓ అవినీతి కేసులో అరెస్ట్ అయితే టీడీపీ నేతలు ఓ విప్లవకారుడిలా బిల్డప్ ఇస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం , దాని అనుబంధ శక్తులు చేస్తున్న దుష్ప్రచారంపై రేపటి సభలో జగన్ ఎండగడతారని సజ్జల పేర్కొన్నారు.
ALso Read: ప్రజలను తప్పుదోవ పట్టించడానికే.. చంద్రబాబు అరెస్టు వ్యతిరేక నిరసనలపై సజ్జల కామెంట్స్
కాగా.. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ నెల 9వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. అయితే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.అక్టోబర్ 9వ తేదీన ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్, రీజినల్ కో ఆర్డినేటర్లు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గం,మండల స్థాయి ముఖ్య నాయకులతో కలిసి 8,000 మంది హాజరుకానున్నారు.
ఈ సందర్బంగా రానున్న ఎన్నికలకు సంబంధించి వైసీపీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. వై ఏపీ నీడ్స్ జగన్..అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింతగా వివరించేలా జగన్ సూచనలు చేయనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై కూడా సీఎం జగన్ మాట్లాడే అవకాశం ఉంది. అదే సమయంలో టీడీపీ, జనసేన విమర్శలను బలంగా తిప్పికొట్టడంపై కూడా వైసీపీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తోంది.