ఏపీపై వ్యాఖ్యలు .. తెలంగాణలో లేనివి కూడా చెప్పండి : కేసీఆర్కు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీలోని పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తెలంగాణలో ఏం లేవో కూడా కేసీఆర్ చెప్పుకుంటే బాగుంటుందని రామకృష్ణారెడ్డి చురకలంటించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీలోని పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కోసమే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని ఫైర్ అయయారు. ఆంధ్రాలో విలీనమైన ఏడు మండలాల ప్రజలు మళ్లీ తెలంగాణకు వెళతారా అని ఎవరో అడిగితే మేం వెళ్లమని చెప్పినట్లుగా సజ్జల పేర్కొన్నారు.
తెలంగాణలో ఏం లేవో కూడా కేసీఆర్ చెప్పుకుంటే బాగుంటుందని రామకృష్ణారెడ్డి చురకలంటించారు. సరిహద్దు గ్రామాల ప్రజలు మాకు ముఖ్యమంత్రిగా జగన్ కావాలి అంటున్నారని.. ఏపీలో పెన్షన్ అద్భుతంగా అమలౌతోందని స్వయంగా కేసీఆర్ చెప్పారని ఆయన గుర్తుచేశారు. ఆంధ్రా మాదిరిగానే తాము కూడా పెన్షన్లు అమలు చేస్తామని కేసీఆర్ అన్నారని సజ్జల ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కోటి 60 లక్షల కుటుంబాల్లో 40 లక్షల కుటుంబాలకు నేరుగా లబ్ధి జరిగిందని ఆయన తెలిపారు.
తమ వ్యాపారాలను రక్షించుకునేవాళ్లు హైదరాబాద్లో ర్యాలీలో పాల్గొన్నారని సజ్జల ఆరోపించారు. వందో, రెండోందల మందో చంద్రబాబు ర్యాలీకి రాకుండా ఎలా వుంటారని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. మా ఎమ్మెల్యే వెళ్లినా అంతకంటే ఎక్కువ మంది వస్తారని ఆయన చురకలంటించారు. రోగం వచ్చింది ఆసుపత్రికి వెళ్తానన్న చంద్రబాబు.. 14 గంటలు కారులో ఎలా కూర్చొన్నారని సజ్జల ప్రశ్నించారు.
వ్యాధులు వున్నాయని కోర్టుకు అబద్ధాలు చెప్పి బెయిల్ తెచ్చుకున్నాడని.. ఎన్నో సర్వేల్లో జగన్కు 60 నుంచి 70 శాతం ప్రజామద్ధతు వుందని తేలుతోందని రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎంతమంది కలిసొచ్చిన మిగిలిన ఆ 30 శాతం ఓట్లు పంచుకోవడమేనని.. మన కోసం నిలబడిన నాయకుడికి అండగా నిలబడాలని సజ్జల పిలుపునిచ్చారు.