Asianet News TeluguAsianet News Telugu

అలాంటివి చంద్రబాబు మానలేదు.. నీలాగా మోసాలు, కుట్రలు జగన్‌కు తెలియదు: సజ్జల రామకృష్ణారెడ్డి

మోసాలు, భ్రమలు కల్పించడాన్ని చంద్రబాబు ఇంకా మానలేదని  వైసీపీ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు మోసాలపై ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. చంద్రబాబులా మోసాలు చేయడం, కుట్రలు, కుతంత్రాలు పన్నడం జగన్ కు తెలియవని సజ్జల సూచించారు.

ysrcp leader sajjala rama krishna reddy slams tdp chief chandrababu naidu
Author
Amaravati, First Published Sep 22, 2021, 3:00 PM IST

ప్రజలను మోసం చేయడం, భ్రమలు కల్పించడంలో చంద్రబాబు దిట్ట అని ఆరోపించారు వైసీపీ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన ముస్లిం సంచార జాతుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. మోసాలు, భ్రమలు కల్పించడాన్ని చంద్రబాబు ఇంకా మానలేదని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు మోసాలపై ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

చంద్రబాబు హయాంలో 35 లక్షల మందికి పింఛన్లను ఇస్తే.. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 60 లక్షల మందికి అందజేస్తున్నారని సజ్జల చెప్పారు. నాడు టీడీపీ హయాంలో పింఛన్లకు రూ.500 కోట్లు కేటాయించేవారని, ఇప్పుడు అది రూ.1,400 కోట్లకు పెరిగిందని గుర్తు చేశారు. చంద్రబాబు తన హయాంలో రూ.3 లక్షల కోట్ల అప్పులు చేశారని, కానీ, జగన్ మాత్రం వివిధ పథకాల రూపంలో లబ్ధిదారుల ఖాతాలో రూ.లక్ష కోట్లు జమ చేశారని రామకృష్ణారెడ్డి కొనియాడారు.

నాడు దోపిడీ సాగితే.. నేడు పారదర్శక పాలన నడుస్తోందన్నారు. ప్రభుత్వ పథకాలపై చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని సజ్జల పిలుపునిచ్చారు. చంద్రబాబులా మోసాలు చేయడం, కుట్రలు, కుతంత్రాలు పన్నడం జగన్ కు తెలియవన్నారు. ప్రతి పేద విద్యార్థికీ చదువు చేరువయ్యేలా జగన్ చర్యలు తీసుకుంటున్నారని సజ్జల ప్రశంసించారు. పేద, మధ్యతరగతి వర్గాలకు విద్య, వైద్యం అందేలా నాడు–నేడు అనే పథకాన్ని తీసుకొచ్చారన్నారు. ప్రతి జిల్లాతో పాటు వెనుకబడిన ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నారని జగన్ చెప్పారు
 

Follow Us:
Download App:
  • android
  • ios