ఒంగోలు ఘటనపై చంద్రబాబు పరిధి దాటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. పోలవరం ఆలస్యం కావడానికి చంద్రబాబే కారణమన్నారు. కిందిస్థాయి అధికారి చేసిన తప్పుకు మొత్తం ప్రభుత్వాన్నే తప్పు పడుతున్నారని సజ్జల ఫైరయ్యారు.
ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) . గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. చంద్రబాబు లాంటి వాళ్లు దేవతానుగ్రహం వుండొద్దని కోరుకుంటున్నానని సజ్జల వ్యాఖ్యానించారు. రాష్ట్రం సుభిక్షంగా వుండాలంటే చంద్రబాబు మళ్లీ రాకూదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు మతి భ్రమించిందని.. ఆయన ప్రస్తుతం సంధికాలంలో వున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. పోలవరంపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆయన మండిపడ్డారు.
పోలవరం ఆలస్యానికి చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలే కారణమని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఒంగోలు ఘటనపై సీఎం వైఎస్ జగన్ వెంటనే స్పందించారని ఆయన తెలిపారు. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సజ్జల హితవు పలికారు. ఉన్మాదం, బరి తెగింపు, లెక్కలేని తనం ఏమైనా వున్నాయంటే అది చంద్రబాబేనన్నారు. కిందిస్థాయి అధికారి చేసిన తప్పుకు మొత్తం ప్రభుత్వాన్నే తప్పు పడుతున్నారని ఆయన ఫైరయ్యారు. చంద్రబాబును జనం ఇన్నాళ్లు భరిస్తూ వస్తున్నారని సజ్జల వ్యాఖ్యానించారు.
అసలేం జరిగింది:
పల్నాడు జిల్లా వినుకొండకు (vinukonda) చెందిన వేమల శ్రీనివాస్ కుటుంబం తిరుమలకు బయలుదేరింది. ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు పిల్లలు ఇన్నోవా కారులో తిరుపతికి బయలు దేరారు. ఒంగోలు పట్టణంలోని బుధవారం నాడు రాత్రి చేరుకున్నారు. పాత మార్కెట్ సెంటర్ లోని హోట్ వద్ద శ్రీనివాస్ కుటుంబం టిఫిన్ చేస్తున్న సమయంలో కానిస్టేబుల్ తిరుపతిరెడ్డి అక్కడికి వచ్చి సీఎం పర్యటన నేపథ్యంలో వాహనం కావాలని అడిగాడు. తాము తిరుపతికి వెళ్తున్నామని చెప్పినా కూడా విన్పించుకోకుండా డ్రైవర్ తో సహా వాహనాన్ని తీసుకెళ్లాడు. దీంతో తిరుమల వెళ్ళాల్సిన శ్రీనివాస్ కుటుంబం ఒంగోలులోనే చిక్కుకుంది. చివరకు మరో వాహనం తెప్పించుకుని వారు తిరుమలకు చేరుకున్నారు.
ఆ వెంటనే టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు (chandrababu naidu) సైతం ఈ వ్యవహారంపై స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రేపు (శుక్రవారం) ఒంగోలు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు సామాన్య ప్రజలను ఇబ్బందిపెట్టడం దారుణమన్నారు. సీఎం కాన్వాయ్ కోసమంటూ పిల్లాపాపలతో తిరుపతి వెళుతున్న ఓ కుటుంబాన్ని రోడ్డుపైనే వదిలేసి కారును లాక్కెళ్లడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రజాసేవ చేయాల్సిన ముఖ్యమంత్రి ఇలా ప్రజలను ఇబ్బందిపెట్టడం ఏంటని ప్రశ్నించారు. సీఎం కాన్వాయ్ కోసం ఆర్టీఏ అధికారులు సామాన్య ప్రజల కార్లను లాక్కెళ్ళడం రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు నిదర్శనమని చంద్రబాబు మండిపడ్డారు.
