ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో ఇంకా కసరత్తు జరుగుతోందన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. రేపు మధ్యాహ్నానికి తుది జాబితా రూపొందే అవకాశం వుందని సజ్జల తెలిపారు.
ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్ధీకరణ (ap cabinet reshuffle) నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ (ys jagan), వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) మరోసారి భేటీ కానున్నారు. ఇవాళే తుది జాబితా తయారు చేసే విధంగా కసరత్తు చేస్తున్నారు. సీఎం సజ్జల భేటీపై ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శ్రీరామ నవమి పట్టాభిషేక ముహుర్తానికే మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు నవమి మంచిరోజు కావడంతో రేపే కొత్త మంత్రుల జాబితాను (ap new cabinet) ప్రకటించే అవకాశం వుంది. ఆంధ్రప్రదేశ్ పాత మంత్రుల రాజీనామాలు త్వరలోనే గవర్నర్కు అందనున్నాయి.
రేపు మధ్యాహ్నం వరకు ఈ కసరత్తు వుంటుందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అన్ని కాంబినేషన్స్ని సీఎం వర్కవుట్ చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అన్ని అంశాలను సీఎం జగన్ పరిశీలిస్తున్నారని రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎవరినీ బుజ్జగించాల్సిన అవసరం లేదని.. జగన్ టీమ్లో పనిచేస్తున్నందుకు ఎమ్మెల్యేలు హ్యాపీగానే వున్నారని సజ్జల పేర్కొన్నారు. మహిళలకు సముచిత స్థానం వుంటుందని, పాత, కొత్త కలయికతో కేబినెట్ వుంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. లిస్ట్ ఫైనల్ అయ్యాక కాబోయే మంత్రులకు రేపు ఫోన్లు చేస్తారని మంత్రి వెల్లడించారు.
ఈ సాయంత్రం లేదంటే రేపు ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు (biswabhusan harichandan) రాజీనామా లేఖలు అందనున్నాయి. ఆ వెంటనే రాజీనామాలను ఆమోదించనున్నారు గవర్నర్. కొత్త మంత్రులపై సీఎం జగన్ కసరత్తు తుది దశకు చేరింది. కొత్తగా మంత్రి వర్గంలోకి తీసుకునేవారితో పాటు కొనసాగించే వారి పేర్లను కూడా గవర్నర్ వద్దకు పంపనుంది ప్రభుత్వం. సీల్డ్ కవర్లో కొత్త మంత్రుల జాబితా గవర్నర్ వద్దకు చేరనుంది. ఏప్రిల్ 11వ తేదీన మంత్రివర్గ ప్రమాణస్వీకారం జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
అంతకుముదు శుక్రవారం కూడా సీఎం జగన్తో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సీఎం జగన్తో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై చర్చించలేదని సజ్జల తెలిపారు. సీఎం జగన్తో సమావేశం అనంతరం సజ్జల మాట్లాడుతూ.. సీఎంతో మంత్రి వర్గ విస్తరణపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ఇతర అంశాలపై చర్చించామన్నారు. మంత్రి వర్గంలో ఎవరు ఉండాలనేది పూర్తిగా సీఎం నిర్ణయం అన్నారు. అందులో ఎవరి ప్రమేయం ఉండదని, విస్తరణపై కసరత్తు కొనసాగుతోందని సజ్జల అన్నారు.
