చిరు, ఎన్టీఆర్ అభిమానుల ఓటూ జగన్కే.. జనసేన కార్యకర్తల కష్టాలు పగవాడికి వద్దు : పవన్కు పేర్నినాని చురకలు
వైసీపీపై, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. అందరి హీరోల అభిమానులూ జగన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని ఆయన అన్నారు.
అందరి హీరోల అభిమానులు జగన్ను గుండెల్లో పెట్టుకుంటారని వచ్చే ఎన్నికల్లో చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఓట్లూ వైసీపీకేనన్నారు మాజీ మంత్రి పేర్నా నాని. ప్రధానితో భేటీపై పవన్ రోజుకో మాట మాట్లాడుతున్నారని.. ఆయన మాటలు, వీడియోలు మ్యూజియంలో పెట్టాలని నాని సెటైర్లు వేశారు. మంచి పరిపాలన అందిస్తే సినిమాలు చేసుకుంటా అన్నది పవనేని ఆయన గుర్తుచేశారు. పవన్ విధానాలు చూస్తే ప్రజలు ఓటేయలేదని, 2024లో కూడా ఓటేయరని పేర్ని నాని జోస్యం చెప్పారు. చంద్రబాబు , పవన్ల మధ్య అగ్రిమెంట్ రెన్యువల్ అయినట్లుందన్న ఆయన.. అందుకే మళ్లీ వచ్చి పవన్ మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు.
పవన్ ప్రతీ ఎన్నికలకూ ఒక్కో జెండా మారుస్తారని.. ఊసరవెల్లిలా వ్యూహాలు మార్చే వ్యక్తి పవనేనని పేర్ని నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలో వుంటే ఒక వ్యూహం.. లేకుంటే మరో వ్యూహం అమలు చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ - పవన్ ఏం మాట్లాడుకున్నారో తెలియక చంద్రబాబు టెన్షన్ పడుతున్నారని పేర్ని నాని సెటైర్లు వేశారు. ఏమైనా చెప్పాలనుకుంటే వెళ్లి ఆయన చెవిలో చెప్పాలని నాని చురకలు వేశారు. ఇదే ఇప్పటంలో బీజేపీని రోడ్ మ్యాప్ అడిగానని చెప్పింది నువ్వే.. ఇప్పుడు నా యుద్ధం నేనే చేస్తా అనేదీ నువ్వేనంటూ ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీకి 67 సీట్లు వచ్చినప్పుడు నోట్లో వేలు పెట్టుకుని చూశావని, 151 సీట్లు వచ్చినప్పుడు కూడా నోట్లో వేలు పెట్టుకునే చూశావని.. అలా చూడటం నీ అలవాటు అంటూ పేర్ని నాని సెటైర్లు వేశారు.
అప్పు రేపు లాగా పవన్కు కూడా రాజకీయాలు మానేస్తా అనడం అలవాటని, పవన్ను చూసి ఓటేసేవాళ్లు కూడా ఆయన విధివిధానాలు చూసి ఓటేయ్యడం మానేస్తారంటూ పేర్ని నాని దుయ్యబట్టారు. జనసేన కార్యకర్తల కష్టాల పగవాడికి కూడా రాకూడదని, ఎప్పుడు ఏ జెండా ఎత్తాలో వాళ్లకి తెలియదన్నారు. తూర్పు కాపుల మీద అంత ప్రేమ వుంటే మోడీకి ఓ ఫోన్ కొట్టి, ఓబీసీల్లో చేర్మని అడగాలని పేర్ని నాని డిమాండ్ చేశారు.