Asianet News TeluguAsianet News Telugu

సీఎం, సుజనాల మాదిరిగానే లోకేష్ అవినీతి బయటకు...: లక్ష్మీ పార్వతి

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ పై వైఎస్సార్ సిపి నాయకురాలు లక్ష్మీ పార్వతి తీవ్ర విమర్శలు చేశారు. టిడిపి ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరిల అవినీతి వ్యవహారాలు ఇటీవల బయటపడ్డట్లే త్వరలో మంత్రి నారా లోకేష్ బాబు అవినీతి గుట్టు బయటపడనుందంటూ ఆమె జోస్యం చెప్పారు. 
 

ysrcp leader laxmi parvathi fires on chandrababu, lokesh
Author
Amaravathi, First Published Dec 14, 2018, 2:33 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ పై వైఎస్సార్ సిపి నాయకురాలు లక్ష్మీ పార్వతి తీవ్ర విమర్శలు చేశారు. టిడిపి ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరిల అవినీతి వ్యవహారాలు ఇటీవల బయటపడ్డట్లే త్వరలో మంత్రి నారా లోకేష్ బాబు అవినీతి గుట్టు బయటపడనుందంటూ ఆమె జోస్యం చెప్పారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టుల పేరిట భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.  ప్రభుత్వంలో పెద్దలు మొదలుకుని టిడిపి నాయకులు, కార్యకర్తలు కూడా ఈ అవినీతిలో భాగస్వామ్యం అవుతున్నారని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు.  

ఇక్కడ సంపాదించిన అవినీతి సొమ్మును తెలంగాణ ఎన్నికల్లో వెదజల్లి గెలవాలని చంద్రబాబు భావించారని అన్నారు. కానీ తెలంగాణ ప్రజలు వారి ప్రయత్నాలను తిప్పికొట్టారని తెలిపారు. ఓడిపోయే స్థానాన్ని సుహాసినికి కేటాయించడం ద్వారా చంద్రబాబు నందమూరి కుటుంబానికి మరోసారి మోసం చేశారని లక్ష్మీ పార్వతి ఆరోపించారు. 

తెలంగాణలో చంద్రబాబుకు జరిగిన పరాభవమే త్వరలో ఏపిలో కూడా జరగనున్నట్లు వెల్లడించారు. ఇది గ్రహించే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ మద్దతు కోసం తాపత్రయపడుతున్నారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ కు ద్రోహం చేసిన పార్టీగా అభివర్ణించిన చంద్రబాబే ఇప్పుడు అదే పార్టీతో కలవడం సిగ్గుచేటని లక్ష్మీ పార్వతి విమర్శించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios