కడప జిల్లాలో సర్పంచ్ దారుణ హత్య: వేటాడి చంపిన ప్రత్యర్థులు
కడప జిల్లాలో వైసీపీ నేత, సర్పంచ్ ను ప్రత్యర్ధులు మంగళవారంనాడు నరికిచంపారు. గ్రామ సరిహద్దుల్లోనే ప్రత్యర్ధులు ఆయనను వెంటాడి హత్యచేశారు. పులివెందుల నుండి గ్రామానికి వస్తున్న సమయంలో ప్రత్యర్ధులు హత్య చేశారని పోలీసులు తెలిపారు.
కడప: కడప జిల్లా లింగాల మండలం కోమనూతల సర్పంచ్, వైసీపీ నేత మునెప్పను ప్రత్యర్థులు మంగళవారం నాడు దారుణంగా హత్య చేశారు.సర్పంచ్ల శిక్షణ తరగతులకు హాజరయ్యేందుకు పులివెందుల వెళ్లిన మునెప్పను ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికి చంపారు.సర్చంచ్ల శిక్షణ తరగతుల్లో పాల్గొని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో గ్రామ శివారులోనే ప్రత్యర్థులు దారికాచి వేటకొడవళ్లతో హత్య చేశారు.
ఇటీవలనే జరిగిన ఎన్నికల్లో మునెప్ప 150 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్ధిపై విజయం సాధించారు. ఆధిపత్య పోరులోనే ఈ హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.