బెజవాడలో వైసీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనం.. డిసెంబర్ 8న కాదు, ఒకరోజు మందుగానే
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిసెంబర్ 8న నిర్వహించ తలపెట్టిన బీసీల ఆత్మీయ సమ్మేళనం ఒక రోజు ముందే నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
బీసీలపై ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. డిసెంబర్ 8న నిర్వహించాలనుకున్న బీసీల ఆత్మీయ సదస్సును ఒకరోజు ముందే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 7న విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీ సభను భారీగా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సదస్సుకు 60 నుంచి 70 వేల మంది వరకు బీసీ నేతలు హాజరయ్యే అవకాశం వుంది. గ్రామ పంచాయతీ సభ్యుల నుంచి మంత్రుల వరకు హాజరుకానున్నారు.
సభ నిర్వహణకు మూడు కమిటీలను ఏర్పాటు చేశారు సీఎం జగన్. ఏకామిడేషన్ కమిటీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే పార్థసారథి, ట్రాన్స్పోర్ట్ కమిటీ అధ్యక్షుడిగా చిన్న శ్రీను, ఫుడ్ కమిటీ అధ్యక్షుడిగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావును నియమించారు. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి జగన్ చీఫ్ గెస్ట్గా హాజరుకానున్నారు. డిసెంబర్ 7న ఉదయం 8 గంటలకు బ్రేక్ ఫాస్ట్, రిజిస్ట్రేషన్తో సభ ప్రారంభం కానుంది. 10.30 నుంచి ఉపన్యాసాలు, మధ్యాహ్నం 2 గంటలకు సభ నిర్వహించనున్నారు. వేదికపై 200 మంది ప్రజా ప్రతినిధులు వుంటారు. మూడున్నర సంవత్సరాల్లో ప్రభుత్వం బీసీలకు చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ఈ సదస్సు ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.
ALso REad:డిసెంబర్ 8వ తేదీన విజయవాడలో బీసీల ఆత్మీయ సమ్మేళనం: వైసీపీ బీసీ నేతలు
ఇకపోతే.. ఇక, బీసీల కోసం ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై అనుసరించాల్సిన ప్రణాళికలపై నవంబర్ 26న వైసీపీ బీసీ నేతలు చర్చించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, జోగి రమేష్, గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్.. తదితరులు హాజరయ్యారు.