ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు.. కడిగిన ముత్యంలా వస్తాననే నమ్మకంతోనే ఉన్నా: గోరంట్ల మాధవ్
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్కు చెందినదిగా ప్రచారం జరుగుతున్న వీడియో ఒర్జినల్ కాదని అనంతపురం పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఒరిజినల్ దొరికేవరకు ఏం చెప్పలేమని తెలిపారు. ఈ క్రమంలోనే ఈ వీడియో వ్యవహారంపై గోరంట్ల మాధవ్ స్పందించారు.
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్కు చెందినదిగా ప్రచారం జరుగుతున్న వీడియో ఒర్జినల్ కాదని అనంతపురం పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఒరిజినల్ దొరికేవరకు ఏం చెప్పలేమని తెలిపారు. ఈ క్రమంలోనే ఈ వీడియో వ్యవహారంపై గోరంట్ల మాధవ్ స్పందించారు. రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టడానికే ఈ కుట్ర చేశారని మండిపడ్డారు. ఆ వీడియో ఫేక్ అని తేలిందని తెలిపారు. కడిగిన ముత్యంలాగా వస్తాననే నమ్మకంతోనే ఉన్నానని చెప్పారు. వీడియో తనది కాదు కనుకే ఎలాంటి ఒత్తిడికి గురికాలేదని అన్నారు. ఆ వీడియో మార్ఫింగ్ చేసినట్టుగా ఆరోజే చెప్పానని తెలిపారు.
ఇది కొందరు దుర్మార్గులు చేసిన పని అని గోరంట్ల మాధవ్ విమర్శించారు. దీనిపై క్రిమినల్ కేసులు పెట్టించనున్నట్టుగా చెప్పారు. పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. బీసీలు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని పార్టీ టీడీపీ అని విమర్శించారు. ఇకనైనా ఈ రాద్దాంతానికి పుల్స్టాప్ పెట్టాలని కోరారు.
ఇక, అనంతపురం ఎస్పీ పకీరప్ప బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. ఈ వీడియోపై ఎంపీ అభిమాని వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 4వ తేదీన టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామన్నారు. తొలుత ఈ వీడియో ITDP Official అనే వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారన్నారు. ఈ నెల 4వ తేదీ రాత్రి +447443703968 నెంబర్ నుండి ఈ వీడియోను పోస్టు చేశారని ఎస్పీ వివరించారు. ఈ ఫోన్ నెంబర్ యూకేకు చెందిన వోడాఫోన్ నెంబర్ అని తమ దర్యాప్తులో తేలిందని ఎస్పీ చెప్పారు. ఈ నెంబర్ ఉపయోగిస్తుంది ఎవరనే విషయమై తాము దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వివరించారు. యూకే నుండి పోస్టు చేసిన వీడియో ఎడిట్ చేసినట్టుగా ఉందని ఎస్పీ తెలిపారు.ఈ ఫోన్ ఎవరు వాడుతున్నారనే విషయమై వివరాలు ఇవ్వాలని వొడాఫోన్ ను కూడా సమాచారం కోరినట్టుగా చెప్పారు.
ఈ వీడియోను పోస్టు చేసిన వ్యక్తిని ట్రేస్ చేసే వరకుప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలు ఫేక్ వీడియోలేనని ఆయన చెప్పారు. ఈ విషయమై ఒరిజినల్ వీడియో దొరికితే తప్ప ఇది ఒరిజినలా నకిలీదా అనేది తేలుుందన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలోని వీడియో ఎడిటింగ్ లేదా మార్పింగ్ చేశారనే సందేహలున్నాయన్నారు.
ఓ వ్యక్తి పంపిన వీడియోను షూట్ చేసి మరో వ్యక్తి ఈ వీడియోను పోస్టు చేశారని ఎస్పీ వివరించారు.ఒరిజినల్ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతామన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంతవరకు తమకు ఫిర్యాదు చేయలేదని ఎస్పీ చెప్పారు. ఈ వీడియోకు సంబంధించి బాధితులు ఎవరూ కూడా ఫిర్యాదు చేయలేదన్నారు. ఈ కేసు విషయమై బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకొంటామన్నారు. ఒరిజినల్ వీడియో దొరికే వరకు ఏమీ చెప్పలేమన్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ వీడియో మార్పింగ్ లేదా ఎడిటింగ్ చేసి ఉంటారని ఎస్పీ చెప్పారు.