YSRCPApologizeRAJINI: సూపర్ స్టార్ రజనీకాంత్పై వైసీపీ విమర్శలు.. క్షమాపణలు చెప్పాలని నెటిజన్ల డిమాండ్
ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాలకు హాజరై చంద్రబాబు నాయుడిపై పొగడ్తలు కురిపించిన సూపర్ స్టార్ రజనీకాంత్ పై అధికార వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ.. రజనీకాంత్కు క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో చాలా సేపు ట్రెండింగ్లో ఉన్నది.
![ysrcp apologize rajinikanth trending in twitter after ycp leaders slams rajinikanth for praising chandrababu naidu kms ysrcp apologize rajinikanth trending in twitter after ycp leaders slams rajinikanth for praising chandrababu naidu kms](https://static-ai.asianetnews.com/images/01gz469btfjv05m2mcejx6hbaz/chandrababu-naidu--rajinikanth-jpg_363x203xt.jpg)
హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపకుడు, సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ఇటీవలే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎన్టీఆర్ను ఆకాశానికెత్తేశారు. సినిమా రంగంలోనూ, రాజకీయంలోనూ రాణించారని అన్నారు. అదే విధంగా స్టేజీపైనే ఉన్న చంద్రబాబునాయుడుపైనా ప్రశంసలు కురిపించారు.
చంద్రబాబు నాయుడు దార్శనికుడని అన్నారు. ఒక విజన్ ఉన్న నేత అని, ఆయన ఆలోచనలు అమల్లోకి వస్తే దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో టాప్లో ఉంటుందని పొగిడారు. టీడీపీ చీఫ్ చంద్రబాబుపై రజనీకాంత్ ప్రశంసలు అన్ని వర్గాలు సానుకూలంగా స్వీకరించలేవు. ముఖ్యంగా అధికార వైసీపీ నేతలు మాత్రం మండిపడ్డారు. చంద్రబాబుపై విమర్శలతోపాటు ఆయనను పొగిడిన రజనీకాంత్ పైనా మండిపడ్డారు.
ముఖ్యంగా కొడాలి నాని రజనీకాంత్ పై చేసిన వ్యాఖ్యలు ఆయన అభిమానులను బాధపెట్టినట్టు తెలుస్తున్నది. సూపర్ స్టార్ రజనీకాంత్ పొరుగు రాష్ట్రంలోనే హీరో అని, ఇక్కడ జీరో అని అన్నారు. పెద్దాయన ఎన్టీఆర్ను చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచే సమయంలో రజనీకాంత్ తన సాటి నటుడైన ఎన్టీఆర్ వైపు నిలబడలేదని విమర్శించారు. వైస్రాయ్ హోటల్ వెళ్లి వెన్నుపోటు పొడుస్తున్న చంద్రబాబుతో అంటకాగారని ఆరోపించారు. ఇప్పుడు ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాలకు వచ్చి ఆయనను పొగుడుతున్నారని, కానీ, బతికి ఉన్నప్పుడు మాత్రం తోడుగా నిలబడలేదని విమర్శించారు.
Also Read: తెలంగాణ సచివాలయం మసీదు రూపంలో ఉన్నదన్న బీజేపీ.. నెటిజన్లు ఏమన్నారంటే?
కొడాలి నానితోపాటు మరికొందరు వైసీపీ నేతలు.. చంద్రబాబు నాయుడిపై రజనీకాంత్ ప్రశంసలకు అభ్యంతరం తెలిపారు. రజనీకాంత్ పై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్లో రజనీకాంత్కు అనుకూలంగా ట్వీట్లు పోటెత్తాయి. రజనీకాంత్ కు వైసీపీ క్షమాపణలు చెప్పాలని వైసీపీ అపాలజైస్ రజినీ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది.
కొత్తగా రాబోతున్న రజనీకాంత్ సినిమా జైలర్ పోస్టర్ల నూ ట్వీట్ చేస్తూ వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్లు చేస్తున్నారు. ఇతర హీరోల అభిమానులనూ వారు సమీకరిస్తున్నట్టు ట్వీట్ల ద్వారా తెలుస్తున్నది.