Asianet News TeluguAsianet News Telugu

పార్లమెంట్ లో వైసిపి వ్యూహమిదే... పార్టీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం

మరికొద్దిరోజుల్లో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వైసిపి ఎంపీలతో ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ చర్చించారు. 

YSR Congress Chief YS Jagan meeting with his party MPs
Author
Amaravati, First Published Sep 14, 2020, 9:06 PM IST

అమరావతి: రాష్ట్ర ప్రయోజనాలే పరమావదిగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం వైఎస్‌ జగన్ పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం నుంచి రావాల్సినవన్నీ రాబట్టడంతో పాటు, ప్రత్యేక హోదా సాధన కోసం నిరంతరం ప్రయత్నం చేయాలని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించినట్లు... ఆ దిశలో ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వ్మూహాత్మకంగా వ్యవహరించాలని పార్టీ భావిస్తోందని తెలిపారు. 

మరికొద్దిరోజుల్లో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వైసిపి ఎంపీలతో ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ చర్చించారు. మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్‌) జీవీడీ కృష్ణమోహన్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ ఎంపీలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు.

ఎంపీలకు జగన్ చేసిన సూచనలివే: 
 
దిశ చట్టానికి ఆమోదముద్ర:

ఏపీ దిశ బిల్లు, క్రిమినల్‌ లా (ఏపీ అమెండ్‌మెంట్‌) బిల్లు–2019తో పాటు, ప్రత్యేక దిశ కోర్టుల ఏర్పాటును కేంద్ర హోం శాఖ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం కూడా పొందాల్సి ఉంది. కాబట్టి వాటిని ఈ సమావేశాల్లో ప్రస్తావించాలని వైయస్సార్‌సీపీ ఎంపీలు నిర్ణయించారు.

పోలవరం నిధులు:

పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి రూ.3232 కోట్లు రీయింబర్స్‌మెంట్‌ కింద రావాల్సి ఉండడంతో పాటు, ప్రాజెక్టు పనులకు ఇంకా రూ.30 వేల కోట్లకు పైగా నిధులు వ్యయం చేయాల్సి ఉన్నందున, వాటి గురించి కూడా ఈ సమావేశాల్లో ప్రస్తావించనున్నారు. ప్రాజెక్టులో 41.5 మీటర్ల ఎత్తులో నీరు నిల్వ చేయడం కోసం రూ.3 వేల కోట్లు ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద ఖర్చు చేయాల్సి ఉన్నందు వల్ల, వెంటనే అన్ని నిధులు కోరాలని పార్టీ ఎంపీలు నిర్ణయించారు.

read more   అమరావతిపై పార్లమెంట్‌లో ప్రకటన చేయండి: మోడీకి రైతుల లేఖ

జీఎస్టీ పరిహారం:

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిహారం కింద రూ.3622 కోట్లు రావాల్సి ఉన్నందున, ఆ నిధుల కోసం పట్టు బట్టాలని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు భావిస్తున్నారు.

యూఎల్‌బీ పెండింగ్‌ నిధులు:

14వ ఆర్థిక సంఘం ప్రకారం 2015–2020 మధ్య అయిదేళ్లకు సంబంధించి రూ.3635.80 కోట్లు పట్టణ స్థానిక సంస్థల (యూఎల్‌బీ)కు కేటాయించగా, వాటిలో ఇంకా రూ.582 కోట్లు నికరంగా రావాల్సి ఉంది. వాటి కోసం ఇప్పటికే కేంద్ర మంత్రికి లేఖ రాసినప్పటికీ స్పందన లేకపోవడంతో, ఈ సమావేశాల్లో ఆ అంశాన్ని ప్రస్తావించాలని వైయస్సార్‌సీపీ ఎంపీలు నిర్ణయించారు. 

13 టీచింగ్‌ ఆస్పత్రులు:

రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నందు వల్ల, 13 టీచింగ్‌ ఆస్పత్రులకు అనుమతి ఇచ్చేలా సమావేశాల్లో కేంద్రాన్ని కోరాలని కూడా పార్టీ నిర్ణయించింది. 

సీటీయూ రీలొకేట్‌:

రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సీటీయూ)ను గిరిజనేతర ప్రాంతమైన విజయనగరం జిల్లా రెల్లిలో ప్రతిపాదించారని, అయితే అది గిరిజనేతర ప్రాంతం కావడం వల్ల దాన్ని మార్చాలని వైయస్సార్‌సీపీ కోరుతోంది. ఆ మేరకు అదే జిల్లాలోని సాలూరులో సీటీయూ ఏర్పాటయ్యేలా రీలొకేట్‌ చేయాలని కేంద్రాన్ని కోరాలని పార్టీ ఎంపీలకు జగన్ సూచించారు. 

మండలి రద్దు ప్రక్రియ:

శాసనమండలి రద్దుకు సంబంధించి ఈ ఏడాది జనవరి 27న శాసనసభ తీర్మానం చేసి పంపినప్పటికీ, ఇప్పటి వరకు దాన్ని కేంద్రం పట్టించుకోలేదు కాబట్టి, కేంద్ర హోం శాఖ వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించాలని సీఎం జగన్ పార్టీ ఎంపీలను ఆదేశించారు.

ఏడు జిల్లాలు చేర్చాలి:
రాష్ట్రంలో కూడా రివర్స్‌ మైగ్రేషన్‌ (ఉపాధి కోల్పోయి సొంత ఊళ్ల బాట పట్టిన వలస కూలీలు) ఎక్కువగా ఉంది కాబట్టి గరీబ్‌ కళ్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌లో ఏడు జిల్లాలు.. విశాఖపట్నం, విజయనగరం, ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలను చేర్చేలా కేంద్రాన్ని కోరాలని వైయస్సార్‌సీపీ ఎంపీలు నిర్ణయించారు.

వేర్వేరుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్లు:

వేర్వేరుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు సంబంధించిన బిల్లును గత ఏడాది డిసెంబరు 17న శాసనసభ ఆమోదించగా, ఈ ఏడాది ఫిబ్రవరి 24న కేంద్రం ఆమోదం కోసం పంపారు. నెలలు గడిచినా అది కూడా కేంద్ర హోం శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. దీంతో ఈ అంశాన్ని కూడా సమావేశాల సందర్భంగా ప్రస్తావించాలని సీఎం జగన్ తమ పార్టీ ఎంపీలను ఆదేశించారు.

ల్యాండ్‌ టైటలింగ్‌ యాక్ట్‌:

రాష్ట్రంలో భూముల రీసర్వేకు సంబంధించిన ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను కూడా శాసనసభలో గత ఏడాది అంటే 2019లో ఆమోదించారు. కేంద్రం అనుమతి కోరుతూ ఈ ఏడాది జూలై 29న ఆ బిల్లును పంపగా ఇప్పటికీ పెండింగ్‌లో ఉండి పోయింది. భూముల రీసర్వే ఒక మహత్తర కార్యక్రమం అన్న ముఖ్యమంత్రి ఈ అంశంపైనా పార్టీ ఎంపీలు దృష్టి పెట్టి, కేంద్రం వెంటనే ఆ బిల్లు ఆమోదించేలా చూడాలని నిర్దేశించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios