వైఎస్ వివేకా హత్య కేసు.. ఉదయ్ కుమార్రెడ్డి రిమాండ్ పొడిగింపు..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి జ్యూడిషియల్ రిమాండ్ను కోర్టు పొడిగించింది.
![YS Viveka Murder Case uday kumar reddy remand extended to may 10th ksm YS Viveka Murder Case uday kumar reddy remand extended to may 10th ksm](https://static-ai.asianetnews.com/images/01gv290e18nc6tw55y1728dhr4/verdict_363x203xt.jpg)
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి జ్యూడిషియల్ రిమాండ్ను కోర్టు పొడిగించింది. ఉదయ్ కుమార్ రెడ్డికి గతంలో కోర్టు విధించిన రిమాండ్ బుధవారంతో ముగిసింది. దీంతో ఉదయ్ కుమార్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం ఉదయ్ కుమార్ రెడ్డికి మే 10వ తేదీ వరకు జ్యూడిషయల్ రిమాండ్ను పొడిగించింది. దీంతో ఉదయ్ కుమార్ రెడ్డిని చంచల్గూడ జైలుకు తరలించారు.
ఇక, వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి సన్నిహితుడు. వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఈ నెల 14న ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ నెల 16న అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వైఎస్ భాస్కర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిలను ఏప్రిల్ 19 నుంచి 24 వరకు ఆరు రోజుల పాటు విచారించేందుకు తెలంగాణ హైకోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. దీంతో ఆరు రోజుల పాటు సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను విచారించారు.
నేరం జరిగిన ప్రదేశంలో సాక్ష్యాలను ధ్వంసం చేయడంలో వారి ఆరోపించిన పాత్ర గురించి సీబీఐ అధికారులు వారిద్దరినీ ప్రశ్నించింది. వివేకా హత్య కేసులో రూ. 40 కోట్ల డీల్, నిందితులలో ఒకరైన సునీల్ యాదవ్కు రూ. 1 కోటి చెల్లింపు అంశంలో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను దర్యాప్తు సంస్థ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది.
అయితే వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల ఆరు రోజుల కస్టడీ విచారణ పూర్తయిన తర్వాత వారిని సీబీఐ సోమవారం(ఏప్రిల్ 24) నాంపల్లి కోర్టులో హాజరుపరిచింది. ఈ క్రమంలోనే కోర్టు ఉదయ్ కుమార్ రెడ్డికి ఏప్రిల్ 26 వరకు, భాస్కర్ రెడ్డికి ఏప్రిల్ 29 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే నేటితో ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ ముగియడంతో కోర్టు ముందు హాజరుపరుచగా.. మే 10 వరకు జ్యూడీషియల్ రిమాండ్ను పొడిగించింది.