మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు మరోసారి  సీబీఐ విచారణకు హాజరయ్యారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పొందిన తరువాత సీబీఐ విచారణకు హాజరుకావడం ఇది మూడోసారి. 

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించనున్నారు. ఈ కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా తెలంగాణ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పలు షరతులు విధించింది. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ విచారణకు హాజరుకావాలని అవినాష్ రెడ్డిని హైకోర్టు ఆదేశించింది. 

ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి నేడు మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. అవినాష్ ముందస్తు బెయిల్ పొందిన తరువాత సీబీఐ విచారణకు హాజరుకావడం ఇది మూడోసారి. ఇక, ఈ కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డిని గతంలో కూడా పలుమార్లు సీబీఐ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కేసులో అవినాస్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వివేకా కూతురు సునీతా రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 

ఇక,ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని సీబీఐ ఇటీవల ఏ8గా పేర్కొన్న సంగతి తెలిసిందే. వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ ఇవ్వొద్దని కౌంటర్‌ దాఖలు చేసిన సమయంలో.. ఈ కేసులో అవినాష్ రెడ్డిని ఏ8 అని సీబీఐ పేర్కొంది. వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో అవినాష్‌, భాస్కర్‌రెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ ఈ కౌంటర్‌లో తెలిపింది. వివేకా హత్య, ధ్వంసం వెనక భారీ కుట్రపై దర్యాప్తు సాగుతుందని పేర్కొంది. అవినాష్‌, భాస్కర్‌రెడ్డి‌లు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని తెలిపింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని ప్రలోభపెట్టినట్టుగా కూడా పేర్కొంది. 

వివేకానందరెడ్డి హత్య విషయం ఆయన పీఏ కృష్ణారెడ్డి చెప్పకముందే అవినాష్ రెడ్డికి తెలుసునని సీబీఐ పేర్కొంది. . వివేకా హత్య విషయం సీఎం జగన్‌కు ఉదయం 6.15కి ముందే తెలుసని సీబీఐ తెలిపింది. శివశంకర్‌రెడ్డి ఫోన్‌ చేసిన నిమిషంలోనే అవినాష్‌రెడ్డి హత్యాస్థలికి చేరుకున్నారని తెలిపింది. హత్య జరిగిన రోజు ఉదయం 5.20కి ముందే అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డితో గంగిరెడ్డి మాట్లాడినట్టు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడని పేర్కొంది. దస్తగిరిని ప్రలోభ పెట్టేందుకు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి అనేక ప్రయత్నాలు చేశారని తెలిపింది. కడప, పులివెందుల ప్రాంతాల్లో భాస్కర్‌రెడ్డి చాలా ప్రభావితం చేయగల వ్యక్తి అని పేర్కొంది. భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ ఇచ్చి ఎన్ని షరతులు పెట్టినా నిరుపయోగమేనని తెలిపింది. దర్యాప్తునకు సహకరించానని భాస్కర్‌రెడ్డి చెప్పడం అబద్ధమని పేర్కొంది.