మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి ఈరోజు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో లొంగిపోయారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి ఈరోజు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో లొంగిపోయారు. ఈ కేసులో ఏ-1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి కొంతకాలంగా బెయిల్‌పై బయట ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా  తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ఆయన సీబీఐ కోర్టులో లొంగిపోయారు. దీంతో సీబీఐ కోర్టు ఎర్ర గంగిరెడ్డికి జూన్ 2 వరకు రిమాండ్ విధించింది. దీంతో సీబీఐ అధికారులు ఎర్ర గంగిరెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.  

ఇక, వైఎస్ వివేకా హత్య కేసు అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) 2019 మార్చి 28న గంగిరెడ్డిని అరెస్టు చేసింది. ఆ తర్వాత ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే నిర్దిష్ట వ్యవధిలో ఛార్జిషీట్ దాఖలు చేయడంలో సిట్ విఫలమైనందున..గంగిరెడ్డికి పులివెందులలోని స్థానిక కోర్టు 2019 జూన్ 27న డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ తర్వాత ఈ కేసు సీబీఐ చేతికి వెళ్లింది. సీబీఐ విచారణ చేపట్టి చార్జిషీట్‌ దాఖలు చేసి.. ఈ కేసులో ఏర్ర గంగిరెడ్డిని ఏ-1 గా పేర్కొంది. ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించింది.అయితే సీబీఐ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా దిగువ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది.

ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతేడాది నవంబర్‌లో ఈ హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ  చేసింది. దీంతో గంగిరెడ్డి బెయిల్‌ రద్దు కోసం సీబీఐ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఎర్ర గంగిరెడ్డి సాక్షులకు బెదిరింపులు, విచారణకు ఆటంకం కలిగిస్తున్నారని సీబీఐ ఆరోపించింది. మరోవైపు గంగిరెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించి సీబీఐ వద్ద సాక్ష్యాధారాలు లేవని ఆయన తరఫు లాయర్ పేర్కొన్నారు. 

అయితే ఇరువైపుల వాదనల అనంతరం.. సీబీఐ వాదనలతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేసింది. మే 5వ తేదీలోగా ఎర్రగంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోవాలని.. అలా కానీ పక్షంలో ఆయనను సీబీఐ అరెస్టు చేసేందుకు అనుమతించింది. ఈ క్రమంలోనే నేడు సీబీఐ కోర్టుకు వచ్చిన ఎర్రగంగిరెడ్డి న్యాయవాదుల సమక్షంలో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు. 

ఇక, ఇప్పటికీ ఈ కేసులో అరెస్టయిన సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలు చంచల్ గూడ జైల్లో ఉన్నారు. వైఎస్ వివేకా హత్యకు పథక రచన చేయడంతో పాటు దాన్ని అమలు చేసి, తర్వాత సాక్ష్యాధారాలు ధ్వంసం చేయడంలోనూ ఎర్రగంగిరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు సీబీఐ పేర్కొంది.