వివేక హత్యకు ముందు రోజు 2019 మార్చి 14 ఉదయం నుంచి చోటుచేసుకున్న పరిణామాలు, ఎవరు.. ఎవరెవరికి ఫోన్లు చేశారన్న విషయాన్ని ఆమె సీబీఐకి అందజేశారు. వైయస్ మనోహర్ రెడ్డి మీద అనుమానాలున్నాయని ఆధారాలు  తడిచి వేయాలని  తనకు మనోహర్ రెడ్డి సూచించినట్లు ఎర్ర గంగిరెడ్డి పోలీసుల విచారణలో చెప్పారని ఆమె పేర్కొన్నారు..  

అమరావతి :  వైయస్ వివేకానంద రెడ్డితో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డికి అటు రాజకీయంగా, ఇటు బంధుత్వ పరంగా శత్రుత్వం ఉందని సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేకా కుమార్తె  నర్రెడ్డి సునీతపేర్కొన్నారు. వివేకానంద రెడ్డి హత్య ఘటనలో ప్రమేయానికి సంబంధించిన అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి సహా ఎవరెవరిపై తనకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి…వాటికి కారణాలేంటో సీబీఐకి ఆమె చెప్పారు.

వివేకా చనిపోయాక హత్యా స్థలంలో ఆధారాలు తుడిచేయాలని భాస్కర్ రెడ్డి తనను ఆదేశించినట్లుగా గంగిరెడ్డి చెప్పడం కూడా ఆయనపై తన అనుమానానికి కారణంగా పేర్కొన్నారు. ఎర్ర గంగిరెడ్డి ఒక్కోసారి ఒక్కొక్కరి పేరు చెప్పారన్నారు. ఇంకా ఆమె అనుమానితులుగా పేర్కొన్న వారిలో కొందరు వివరాలు, వారిని అనుమానించడానికి ఆమె చెప్పిన కారణాలు ఇవి…

దేవిరెడ్డి శివశంకర్రెడ్డి..

అవినాష్ కుటుంబానికి  సన్నిహితుడు. వివేకానంద రెడ్డి అంటే శివశంకర్ రెడ్డి కి భయం. ఆయనకు ఎదుట పడే వారు కాదు. వివేకా ఇంట్లోకి  ఆయన అడుగు పెట్టే వారే కాదు. అలాంటి శివ శంకర్ రెడ్డి… మార్చి 15న ఉదయం వివేకా హత్య జరిగిన ప్రదేశం నుంచి అవినాష్రెడ్డి వెళ్లిపోయాక కూడా అక్కడే ఉన్నారు. శివశంకర్ రెడ్డిపై గతంలో చాలా నేరారోపణలు ఉన్నాయి. 2017లో వివేక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడానికి ఆయన కారణం. సంఘటన జరగడానికి ముందు రోజు రాత్రి  ఎనిమిది గంటలకు ఎర్ర గంగిరెడ్డి ఆయన ఫోన్ చేశాడు. వివేక మృతదేహాన్ని చూడడానికి ముందు ఒకసారి, చూసిన తర్వాత ఒకసారి  సాక్షి విలేకరి శివశంకర్రెడ్డి ఫోన్ చేశారు. ఉదయం 6.24కి 141  సెకన్లు, ఉదయం 6.46కి 17 సెకన్లు ఆయనతో మాట్లాడారు.

వివేక  గుండెపోటుతో చనిపోయారని నిర్ధారణకు శివశంకర్రెడ్డి ఎలా వచ్చారు?  ఆ విషయాన్ని విలేఖరికి ఎప్పుడూ చెప్పారు? వివేక గుండెపోటుతో చనిపోయారని విలేకరి చెప్పినట్లు ఆ తర్వాత పోలీసుల విచారణలో శివశంకర్ రెడ్డి అంగీకరించారు.  హత్యా స్థలంలో ఫోటోలు తీయడానికి శివశంకర్రెడ్డి ఎవరిని ఎందుకు అనుమతించలేదు? అది నేరం జరిగిన ప్రదేశం( క్రైమ్ సీన్)అని  ఆయన ముందే తెలియడం వలనా? మరి ఆధారాలు ఎందుకు చెరిపేశారు?  వివేక మృతదేహానికి  పోస్టుమార్టం నిర్వహించినంతసేపు  ప్రతి విషయాన్ని శివశంకర్ రెడ్డికి  డాక్టర్ సతీష్  ఎందుకు చెబుతూ వచ్చారు?

ఉదయ్ కుమార్ రెడ్డి
ఉదయ్ కుమార్ రెడ్డి ఫోనుకి  14వ తేదీ అర్థరాత్రి దాటాక 1:00 సమయంలో బస్టాండ్ దగ్గర ఉన్న టవర్ పరిధి నుంచి మెసేజ్ వచ్చింది.  తెల్లవారుజామున 3:30 కి ఇంటి నుంచి బయటకు వెళ్లారు.  సీబీఐ విచారణ కోరుతూ  నేను కోర్టులో పిటిషన్ వేశాక.. తన కుమారుడు ఇబ్బందుల్లో పడ్డాడని  ఉదయ్ తండ్రి వ్యాఖ్యానించినట్లు తెలిసింది.  ఉదయ్,  ఈసీ సురేందర్ రెడ్డితో  వెళ్లి,  దేవిరెడ్డి శివశంకర్రెడ్డి ని 15వ తేదీ తెల్లవారుజామున కలిశారు. డాక్టర్ ని తీసుకురమ్మని  అవినాష్ రెడ్డి పిఏ రమణారెడ్డి ఉదయం 6:30 కి ఉదయ్ కి ఫోన్ చేశారు. వెంటనే డాక్టర్ సతీష్ రెడ్డి ఉదయ్ ఫోన్ చేసి వివేక ఇంటికి రమ్మని చెప్పారు. అప్పటికి నంద్యాల లో ఉన్న సతీష్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి కి ఫోన్ చేసి వివరంగా ఇంటికి వెళ్లాలని చెప్పారు.

మధుసూదన్ రెడ్డి మందులు తీసుకుని బయల్దేరారు మధు మందులు ఎందుకు తీసుకెళ్లారు? సతీష్ రెడ్డి ఆయనకు ఏం చెప్పారు?  వివేక చనిపోయారనా? అనారోగ్యంతో ఉన్నారనా? వివేకా చనిపోయారని  డాక్టర్లైన సతీష్, మధు లకు తెలియదా? ఉదయ్ స్కార్పియోలో వెళ్లి మధు ని తీసుకు రావడం,  అప్పటికే చనిపోయిన వ్యక్తి కోసం మందులను తేవడం, ఈ కేసు విషయంలో భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి లను డిసెంబర్ 3న డిటిసిలో పోలీసులు ప్రశ్నిస్తున్నప్పుడు..రూ.2-3  కోట్లు ఇచ్చి సెటిల్ చేసుకుంటే సరిపోతుంది కదా?  అని శివశంకర్ రెడ్డితో ఉదయ్ వ్యాఖ్యానించడం.  అవినాష్ అరెస్ట్ అవుతారని ఉదయ్ తన మిత్రుడు కొందరితో చెప్పడంతో వెంటనే ఆయన పై అనుమానాలకు కారణాలు.

ఈ సి సురేందర్ రెడ్డి
జగన్ సతీమణి వైయస్ భారతి చిన్నాన్న కుమారుడు

2019 మార్చి 15 ఉదయం సాక్షి విభాగంలో పనిచేసిన తన భార్యతో సురేందర్ రెడ్డి మాట్లాడారు. గుండెపోటుతో చనిపోయారని సాక్షి టీవీలో ఉదయం 10:30 వరకు ఆమె నడిపించారు. అలా ఎందుకు చేశారు?

ఎర్ర గంగిరెడ్డి 
వివేకాకు చిరకాల పరిచయస్తుడు

వివేకానంద రెడ్డికి బాగా తెలిసిన వ్యక్తి.  40 ఏళ్ల నుంచి వివేకా కుటుంబంతో అనుబంధం ఉంది. వివేకా తోనే ఎక్కువ సమయం గడిపేవారు. 2019  మార్చి 14న వివేకా ఒంటరిగానే ఉన్నారని, కుటుంబ సభ్యులు, అల్లుడు రాజశేఖర్ ఆయనతో లేరని ఎర్ర గంగిరెడ్డి తెలుసు. హైదరాబాదులో ఒక ఫంక్షన్ కి వెళ్లాల్సి ఉన్నా ఎర్ర గంగిరెడ్డి వెళ్లలేదు. 14న రాత్రి 8 గంటల కంటే ముందు శివశంకర్ రెడ్డి తో గంగిరెడ్డి మాట్లాడారు. 15న ఉదయం ఘటనా స్థలంలో మృతదేహాన్ని ముట్టుకోవద్దని రాజశేఖర్ కు  గంగిరెడ్డి సూచించారు. అంటే అక్కడ నేరం జరిగిందని ఆయనకు ముందే తెలుసు. ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాలని తొందర పెట్టారు.

వివేకా హత్య విషయం తెలిశాక వివరాలు కనుక్కుందామని మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన ఎత్తలేదు. వివేకా హత్య గురించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు. వివేక చనిపోయిన రోజు ఖననం జరగాలని పట్టుబట్టారు. కేసు పెట్టొద్దు అని చెప్పింది ఆయనే. పోస్టుమార్టం పూర్తయ్యే వరకు కూడా అది హత్య కాదని అక్కడున్న వారికి పదేపదే చెబుతూ వచ్చారు. అది హత్యే కాదని కొందరితో వాదనకు దిగారు.  ఆధారాలు తుడిచేయాలని చెప్పింది మనోహర్ రెడ్డి అని ఒకసారి, భాస్కర్ రెడ్డి అని ఒకసారి, సీఐ అని మరోసారి చెప్పారు. పోలీసు కస్టడీలో ఉండగా వారితో ‘ మీరు మహా అయితే నన్ను కొడతారేమో..  నోరు తెరిస్తే నన్ను చంపేసారు’ అని చెప్పారు.