మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకొని వాదనలు వినాలని వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఏపీ హైకోర్టు సోమవారం నాడు విచారణ నిర్వహించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకొని వాదనలు వినాలని వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి కోర్టును కోరారు. నిందితుల తరపున న్యాయవాదులు ఇవాళ వాదనలు విన్పించారు. CBI తరపున, సునీత తరపున న్యాయవాదులు రేపు వాదనలు విన్పించనున్నారు. ఈ మేరకు ఈ విషయమై విచారణను బుధవారానికి కోర్టు వాయిదా వేసింది.
మాజీ మంత్రి YS Vivekananda Reddy హత్య కేసులో నిందితుడిగా ఉన్న Devireddy Siva Shankar Reddy బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఈ పిటిషన్ లో తాను కూడా ఇంప్లీడ్ అవుతానని వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి హైకోర్టులో పిటిషన్ ఈ ఏడాది మార్చి 26 పిటిషన్ దాఖలు చేశారు. సమగ్ర వివరాలతో పిటిషన్ దాఖలు చేస్తామని ఆమె ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దేవిరెడ్డి శంకర్ రెడ్డిని గత ఏడాది నవంబర్ 17న CBIఅధికారులు అరెస్ట్ చేశారు. హైద్రాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన వద్ద డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి సీబీఐకి అఫ్రూవర్ గా మారి కీలక సమాచారాన్ని ఇచ్చాడు. ఈ వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు.2019 మార్చి 14న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఆయన ఇంట్లోనే దుండగులు హత్య చేశారు. ఈ హత్యకు ఆర్ధిక లావాదేవీలే కారణమని దస్తగిరి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ హత్య చోటు చేసుకొంది.ఈ హత్య సమయంలో టీడీపీ అధికారంలో ఉంది. చంద్రబాబునాయుడు ఈ హత్యపై విచారణకు సిట్ ను ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ కూడా సిట్ దర్యాప్తును ఏర్పాటు చేసింది.
వివేకానందరెడ్డి హత్యపై 2021 ఆగస్ట్ 30న దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చారు. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ను మిగతా నిందితుల లాయర్లకు కోర్టు ఇచ్చింది. కన్ఫెషన్ స్టేట్మెంట్లో దస్తగిరి బడా నేతల పేర్లు ప్రస్తావించారు. సీఆర్పీసీ 164(1) సెక్షన్ కింద ప్రొద్దుటూరు కోర్టులో స్టేట్మెంట్ రికార్డు చేశారు. హత్యలో నలుగురు పాల్గొన్నట్టు కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఉంది. ఎర్ర గంగిరెడ్డి , సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి కుట్రపన్నినట్లు దస్తగిరి పేర్కొన్నారు.
బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఎర్ర గంగిరెడ్డి పగ పెంచుకున్నారని చెప్పారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను తేల్చాలని కోరుతూ వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవీంద్రలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో వాస్తవాలు వెలుగు చూడాలంటే సీబీఐ విచారణ అవసరమని వారు ఆ పిటిషన్లలో కోరారు. దీంతో ఏపీ హైకోర్టు వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించింది.ఈ ఏడాది మార్చి లో సీబీఐ ఉన్నతాధికారులను కలిసి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను గుర్తించాలని వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత కోరారు. సునీత ఢిల్లీలో సీబీఐ అధికారులను కలిసి వచ్చిన తర్వాత ఈ కేసు విచారణ మరింత వేగవంతమైంది.కడప కేంద్రంగా చేసుకొని సీబీఐ అధికారులు విచారణను కొనసాగించారు.
